పశ్చిమ బెంగాల్లో విషాదం: పేపర్ మిల్లులో ఆరుగురు కార్మికులు మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ లోని హాజీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో విషవాయువులు పీల్చి ఆరుగురు కార్మికులు మృతి చెందారు.గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పేపర్ మిల్లులో ఓ పాడుబడ్డ బావి ఉంది. చాలా కాలంగా అది వ్యర్థాలతో నిండిపోయి ఉంది. మిల్లుకు నీటిని సరఫరా చేసే పంపులు ఈ బావిలోనే ఉన్నాయి. ఇటీవల నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో.. కొంతమంది కార్మికులు బావి లోపలికి దిగి పరిశీలించారు. ఈ క్రమంలో అందులోని విషవాయువులను పీల్చుకోవడంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
వాళ్లను కాపాడటానికి లోపలికి దిగిన మరికొందరు కార్మికులు కూడా విషవాయువులను పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అధికారులు అప్రమత్తమై వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే వారు మృతి చెందారని డాక్టర్లు నిర్దారించారు. మృతులను అశోక్ బోరల్, విజయ్ బర్మా, అమిత్ యాదవ్, ఉదయ్ రాజ్, మిథున్, మహమ్మద్ నజీంగా గుర్తించారు.
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. కార్మికులకు గ్యాస్ మాస్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.