Kings: రాజుల ఫ్యామిలీ, రాయల్ గా లగ్జరీ లైఫ్, రూమ్ నెంబర్ 427లో మిస్టర్ 420, సీసీటీవీల్లో ?!
న్యూఢిల్లీ: విదేశాలకు చెందిన రాజుల కుటుంబానికి తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, మేము కలిసి వ్యాపారాం చేస్తున్నామని, వ్యాపారం పని మీద నేను భారత్ వచ్చానని ఓ వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బందికి చెప్పాడు. యూఏఇ రాజకుటుంబానికి, నాకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని కొన్ని పత్రాలను ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బందికి ఇచ్చాడు. కొన్ని నెలల పాటు ఆ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసిన ఓ వ్యక్తి రూ. 23 లక్షల బిల్లు కట్టకుండా హోటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. మనోడు స్టార్ హోటల్ లో నుంచి పోతాపోతా వెండి వస్తువులు, ముత్యాలతో తయారు చేసిన వెండి ప్లేట్లు ఎత్తుకుపోయాడు. ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బంది ఆ కేటుగాడి మీద దొంగతనం కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
యూఏఇ నుంచి వచ్చాను
గత ఆగస్టులో మోహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి దేశ రాజధాని ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్కు వెళ్లాడు. తనకు ఓ గదిని అద్దెకు కావాలని చెప్పి తీసుకున్నాడు. అక్కడ హోటల్ సిబ్బందికి తాను యుఎఇ నివాసి అని, అబుదాబి రాజకుటుంబానికి చెందిన షేక్ ఫలాహ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో తనకు సన్నిహితంగా పనిచేస్తున్నానని లీలా ప్యాలెస్ హోటల్ సిబ్బందికి మోహమ్మద్ షరీఫ్ చెప్పాడు.
నాలుగు నెలలు ఎంజాయ్ చేశాడు
యూఏఇ రాజకుటుంబానికి తనకు సంబంధం ఉందని నిరూపించడానికి లీలా ప్యాలెస్ హోటల్ సిబ్బందికి మోహమ్మద్ షరీఫ్ కొన్ని పత్రాలు ఇచ్చాడు. మోహమ్మద్ షరీఫ్ ఇచ్చిన పత్రాలు పరిశీలించిన హోటల్ సిబ్బంది మోహమ్మద్ షరీఫ్ నిజంగా రాజకుటుంబానికి చెందిన వాడు అంటూ గుడ్డిగానమ్మేశారు. గత నెల
ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 20 వరకు మూడు నెలలకు పైగా మోహమ్మద్ షరీఫ్ లీలా ప్యాలెస్ హోటల్ లోనే ఉన్నాడు. నవంబర్ 20వ తేదీన మోహమ్మద్ షరీఫ్ లీలా ప్యాలెస్ హోటల్ లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.
రూమ్ నెంబర్ 427 లో బస చేసిన 420
మోహమ్మద్ షరీఫ్ హోటల్ లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో వెండి వస్తువులు, ముత్యాలతో తయారు చేసిన వెండి ప్లేట్లు తదితర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిపోయాడని లీలా ప్యాలెస్ హోటల్ సిబ్బంది గుర్తించి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మోహమ్మద్ షరీఫ్ కోసం గాలిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి నిందితుడు మోహమ్మద్ షరీఫ్ లీలా ప్యాలెస్లోని రూమ్ నంబర్ 427లో ఉన్నాడని, ఆ 420 కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
రాజుగారి పనిమీద ఢిల్లీ వచ్చాను
తాను అబుదాబి రాజకుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని. రాజుగారి అధికారిక పని మీద భారత్ వచ్చానని నిందితుడు మోహమ్మద్ షరీఫ్ చెప్పాడని హోటల్ సిబ్బంది అంటున్నారు. హోటల్ సిబ్బందితో అబుదాబి జీవనశైలి గురించి మాట్లాడాడని, హోటల్ సిబ్బందికి అనుమానం రాకుండా అతను జాగ్రత్తలు తీసుకున్నాడని, సిబ్బందికి నకిలీ పత్రాలు ఇచ్చాడని పోలీసులు అంటున్నారు. నాలుగు నెలలు హోటల్ బిల్లు 35 లక్షలు, అందులో రూ. 11. 5 లక్షలు మోహమ్మద్ షరీఫ్ హోటల్ బిల్లు చెల్లించాడని, నవంబర్ 20వ తేదీన హోటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో హోటల్ సిబ్బందికి రూ. 20 లక్షలకు చెక్కు ఇచ్చాడని, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితుడి కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు.