ఇదే రాజకీయం: రాజీనామా కూడా.. ఎన్ఆర్సీపై 13ఏళ్ల క్రితం మమత ఏంచెప్పారంటే?
కోల్కతా: నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిజిటెన్స్ (ఎన్ఆర్సీ)పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు వేధింపులు లేకుండా ఎన్ఆర్సీకి ఓకే అని కాంగ్రెస్తో పాటు దాదాపు అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. కానీ మమత మాత్రం దీనిని వ్యతిరేకించడం గమనార్హం. మమత తీరును వ్యతిరేకిస్తూ స్వయంగా అసోం టీఎంసీ చీఫ్ రాజీనామా చేశారు.
ఎన్ఆర్సీ విషయంలో మమత వైఖరి సరికాదన్నారు. ఆమెకు పరిస్థితులు తెలియకుండా మాట్లాడుతున్నారనని మండిపడ్డారు. ఎన్ఆర్సీ విషయంలో విపక్షాల మద్దతు కూడగట్టాలనుకున్నప్పటికీ ఆమెకు అంత మద్దతు లభించడం లేదు. ఎందుకంటే అక్రమ చొరబాట్లకు తాము కూడా మద్దతు పలికితే దేశం మొత్తం తమపై వ్యతిరేకత ఏర్పడుతుందని కాంగ్రెస్ సహా మిగతా పార్టీలకు తెలుసు.

13 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ యూటర్న్
ఇదిలా ఉండగా, అక్రమంగా భారత్లో ఉంటున్న వారి విషయంలో మమతా బెనర్జీ 13 ఏళ్ల తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఆమె గతంలో ఒకలా మాట్లాడి, ఇప్పుడు రాజకీయం కోసం మరొకలా స్పందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు 2005లో ఆమె ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చెబుతున్నారనే అంశాలు మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా వస్తున్నాయి. మమత తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చొరబాట్లు చాలా సీరియస్ అంశమని నాడు మమత
2005లో ఇదే చొరబాట్ల విషయం పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న మమత ఇప్పుడు బీజేపీ ఏం చేసిందో దాని కోసం నాడే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ ఇటీవల ట్వీట్ కూడా చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 4-8-2005న లోకసభలో చొరబట్ల అంశాన్ని లేవనెత్తారని గుర్తు చేశారు. చొరబాట్ల కారణంగా బెంగాల్ తీవ్రంగా నష్టపోతోందని, తన వద్ద బంగ్లాదేశీ, మన భారత దేశానికి చెందిన వారి ఓటర్ల జాబితా ఉందని, ఇది (చొరబాట్లు) చాలా సీరియస్ విషయమని, ఈ అంశంపై సభలో ఎప్పుడు చర్చిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నానని మమతా బెనర్జీ అన్నారు. దీనిని జైట్లీ ట్వీట్ చేశారు.

నాడు చొరబాట్లు వ్యతిరేకంగా మమత తీవ్ర నిర్ణయం
అంతేకాదు, చొరబాట్ల కారణంగా అక్రమంగా భారత దేశంలోకి వస్తున్న బంగ్లాదేశీయుల వల్ల పశ్చిమ బెంగాల్లో సీపీఐ-ఎం లబ్ధి పొందుతోందని, అక్రమంగా వస్తున్న బంగ్లాదేశీయులు లెఫ్ట్ పార్టీకి ఓటు బ్యాంకుగా మారారని మమతా బెనర్జీ నాడు ఆరోపించారు. చొరబాట్లకు వ్యతిరేకంగా ఆమె ఆనాడు మరో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అదే లోకసభ సభ్యత్వానికి రాజీనామా. అది ఆమోదం పొందకపోవడం వేరే విషయం. ఆమె రాజీనామా సరైన విధంగా లేకపోవడంతో ఆమోదించలేదు.

నాడు వాయిదా తీర్మానం తిరస్కరణ
నాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న చరణ్జిత్ సింగ్ అత్వాల్ మీదకు మమత కోపంగా తన రాజీనామా పత్రాలను విసిరివేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు వస్తున్నారని చెబుతూ దీనిపై ఆమె వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తిరస్కరించారు. ఆ తర్వాత స్పీకర్ చైర్లో డిప్యూటీ కూర్చున్నారు. తన వాయిదా తీర్మానంపై చర్చించాలని ఆమె పదేపదే పట్టుబట్టారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ అత్వాల్ స్పందించి.. మీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని, దానిపై తాను ఏం చేయలేనని చెప్పారు. అప్పుడు ఎన్ఆర్సీ విషయంలో ఓ విధంగా మాట్లాడిన మమత ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకోవడంపై అందరూ విమర్శిస్తున్నారు.

మమత యూటర్న్కు కారణాలు ఇవేనా?
మమతా బెనర్జీ యూటర్న్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి ప్రధానమత్రి పదవిపై ఆశ. రెండు పశ్చిమ బెంగాల్లో బీజేపీ క్రమంగా ఎదుగుతోంది. ఈ కారణంగా ఆమె ఒత్తిడిలో చొరబాట్లకు కూడా అనుకూలంగా మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారని అంటున్నారు. ఒకే అంశంపై.. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై ఆమె యూటర్న్ తీసుకోవడం విడ్డూరమని అంటున్నారు. మమత తీరు చూస్తుంటే దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే కనిపిస్తున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications