షార్ట్కట్స్ వద్దు! ‘యావరేజ్’ అద్భుతాలు సృష్టిస్తుంది: పరీక్షాపే చర్చలో ప్రధాని మోడీ
ప్రపంచం యావరేజ్ అని పిలిచిన మన దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతోంది! కాబట్టి, మీ సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి అని ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ప్రపంచం యావరేజ్ అని పిలిచిన మన దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతోంది! కాబట్టి, మీ సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి అని ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇంట్లో అమ్మను చూస్తే సమయపాలన తెలుస్తుందన్న మోడీ
ఈ సందర్భంగా విద్యార్థులకు కీలక సూచనలు చేశారు ప్రధాని మోడీ. సమయ పాలన గురించి వివరించారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించాలో మనకు తెలుస్తుందన్నారు. సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలపై భారీ అంచనాలు పెట్టుకుంటే.. అది పెద్ద సమస్య అవుతుందన్నారు.
తాము రాజకీయాల్లో ఉన్నామని.. విజయం కోసం తమపై కూడా భారీస్థాయిలో ఒత్తిడిలో ఉంటుందన్నారు. ఒక క్రికెటర్ మైదానంలోకి వెళ్లిన తర్వాత గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులపై కాకుండా బంతిపైనే దృష్టిపెడతాడని వివరించారు.
జీవితంలో షార్ట్ కట్స్ వద్దంటూ విద్యార్థులతో మోడీ
జీవితంలో షార్ట్ కట్స్ వెతుక్కోవద్దని విద్యార్థులకు ప్రధాని మోడీ సూచించారు. కందరు విద్యార్థులు తమ సృజనను పరీక్షలో చీటింగ్ చేయడం కోసం వాడుతుంటారని.. అదే సమయాన్ని సృజనను మంచి మార్గంలో పెట్టే దిశగా వాడితే.. వారు తప్పక గొప్ప విజయాలు సాధిస్తారని అన్నారు.
మనం జీవితంలో ఎప్పుడూ షార్ట్కట్స్ వెతక్కోకూడదని చెప్పారు. విద్యార్థులు పరీక్ష సమయంలో ఎంతో శ్రమిస్తారని.. వారి శ్రమ ఎప్పటికీ వృథా కాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
అవరేజ్ విద్యార్థులే అద్భుతాలు సృష్టిస్తారన్న మోడీ
సమయాలు మారతాయి.. ప్రతి ఒక్కరికి కొన్ని అసాధారణ నైపుణ్యాలు ఉంటాయి; విషయమేమిటంటే.. మీరు వాటిని గుర్తించాలి అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాని మోడీ చెప్పారు. తమ ప్రతిభకు పదును పెడితే సాధారణ విద్యార్థులే ఎప్పుడూ అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.
స్మార్ట్ వర్క్ లేక హార్డ్ వర్క్ ఏది బెటర్: ప్రధాని ఏమన్నారంటే?
స్మార్ట్ వర్క్ లేక హార్డ్ వర్క్ ఏదీ ముఖ్యమైంది సర్ అంటూ ప్రధానిని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. కొంతమంది చాలా అరుదుగా తెలివితో పనిచేస్తారు. మరికొందరు తెలివిగా కష్టపడతారు అని ప్రధాని మోడీ ఛమత్కరించారు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, దానికి తగ్గట్లే పనిచేసి, అనుకున్న లక్ష్యాలను సాధించాలని ప్రధాని మోడీ సూచించారు.
యువతకు ఒత్తిడి లేని వాతావరణం కోసమే మోడీ పరీక్షాపే చర్చ
కాగా, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈవెంట్లో పాల్గొనేవారు రెండింతలు ఎక్కువయ్యారు. మొత్తం 38.8 లక్షల మంది (31.24 లక్షల మంది విద్యార్థులు, 5.6 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.95 లక్షల మంది తల్లిదండ్రులు) వివిధ రాష్ట్ర బోర్డులు, సీబీఎస్ఈ, కేవీఎస్, ఎన్వీఎస్, ఇతర బోర్డుల నుంచి నమోదు చేసుకున్నారు.
పరీక్షా పే చర్చ అనేది యువతకు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని పెద్ద ఉద్యమం - 'ఎగ్జామ్ వారియర్స్'లో భాగం. ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోడీ 2018, ఫిబ్రవరి 16న నిర్వహించారు.