కేంద్రంపై వాట్సాప్ న్యాయపోరాటం- ఢిల్లీ హైకోర్టులో పిటిషన్-ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమంటూ
కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి అమల్లోకి తెస్తున్న కొత్త సోషల్ మీడియా మార్గదర్శకాలతో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇవాళ్టి నుంచి కేంద్రం తెచ్చే కొత్త విధానానికి అంగీకరించడం లేదా భారత్లో కార్యకలాపాలు మూసేయడం మినహా వాటికి మరో మార్గం లేదు. దీంతో కేంద్రం తీసుకొస్తున్న కొత్త విధానాన్ని సవాల్ చేస్తూ ఆయా సంస్ధలు న్యాయపోరాటానికి సిద్దమయ్యాయి.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా మార్గదర్శకాల్ని సవాల్ చేస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, ఇందులో గోప్యతా హక్కును కాలరాసేలా ఉందని వాట్సాప్ తన పిటిషన్లో ఆరోపించింది. ముఖ్యంగా ఓ పోస్ట్ పెట్టినప్పుడు అది ముందుగా ఎవరు పెట్టారో చెప్పాలనడం యూజర్ల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తుందని వాట్సాప్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నేరగాళ్ల వివరాలు ఇవ్వాలని కేంద్రం కోరుతుండగా.. ప్రతీ యూజర్కూ తాము పోస్ట్ చేసే మెసేజ్లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఇస్తున్నామని, దాన్ని రద్దుచేయడం కుదరదని వాట్సాప్ చెబుతోంది.

డిల్లీ హైకోర్టులో వాట్సాప్ తాజా పిటిషన్తో కేంద్రంతో సోషల్ దిగ్గజాల పోరు మరింత ముదిరినట్లయింది. ఈ వారం ప్రారంభంలో ట్విట్టర్ కార్యాలయాల్లో పోలీసుల తనిఖీల తరువాత ఉద్రిక్తతలు పెరిగాయి. మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ బిజెపి అధికార ప్రతినిధి, మరికొందరి పోస్ట్లను "మానిప్యులేటెడ్ మీడియా" కలిగి ఉన్నట్లు లేబుల్ చేసింది, నకిలీ కంటెంట్ చేర్చబడిందని పేర్కొంది. దీంతో ఈ వివాదం కోర్టుల వరకూ వెళ్లినట్లయింది.












Click it and Unblock the Notifications