ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడినే బుట్టలో పడేశారు.. ఇక సామాన్యులెంత!?
న్యూఢిల్లీ: బరువు తగ్గించే మందుల ప్రకటనల గురించి మనం దినపత్రికల్లోనూ, టీవీ చానెళ్లలోనూ చూస్తూనే ఉంటాం. మా మందు వాడితే వారం రోజుల్లో సులువుగా 5 కేజీల బరువు తగ్గిపోతారనే ప్రకటన చూస్తే అధికబరువు ఉన్న వారు పడిపోకుండా ఉంటారా?
వీటిలో కొన్ని నకిలీ, మోసపూరిత వాణిజ్య ప్రకటనలు కూడా ఉంటాయి. అలాంటి ఓ నకిలీ వాణిజ్య ప్రకటన బారిన పడి సాక్షాత్తు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మోసపోయారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
ఇటీవల రాజ్యసభ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ తప్పుదోవ పట్టిస్తోన్న నకిలీ వాణిజ్య ప్రకటనల అంశాన్ని చర్చకు లేవనెత్తారు. ఈ అంశం చర్చలో భాగంగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కలుగజేసుకుని తన స్వీయ అనుభవాన్ని సభ్యులతో పంచుకున్నారు.
ఇటీవల వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిలో చేరిన తరువాత బరువు తగ్గాలనుకుంటే తమ మందులు వాడాల్సిందిగా సిఫారసు చేస్తున్న ప్రకటన ఒకటి చూశారట.
వెంటనే అందులోని ఫోన్ నంబర్ ద్వారా సంప్రదిస్తే.. తొలుత వెయ్యి రూపాయలు చెల్లించమన్నారట. సరేనంటూ డబ్బు చెల్లించాక.. మందు కోసం మరో వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందిగా మరో మెయిల్ వచ్చిందట.
దీంతో వెంకయ్య నాయుడికి అనుమానం వచ్చి వినియోగదారుల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్కి ఫిర్యాదు చేశారట. ఆయన విచారణ జరిపి, సదరు ప్రకటన నకిలీ అని, ఆ ప్రకటన ఇచ్చిన కంపెనీ అమెరికాకు చెందినదని చెప్పారట.
నకిలీ ప్రకటన విషయంలో తన అనుభవాన్ని వివరించిన వెంకయ్యనాయుడు ఇలాంటి ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించగా.. సభలోనే ఉన్న రాం విలాస్ పాశ్వాన్.. ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.