అసహనం ఎక్కుడుంది?: జైట్లీ, కాంగ్రెస్పై వెంకయ్య
న్యూఢిల్లీ: దేశంలో మత అసహనం ఎక్కడుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. మత అసహన ఘటనలపై రాష్ట్రపతికి కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో మత అసహనం ఇప్పడు లేదు.. ఎప్పుడూ లేదు అన్నారు. దేశంలో శాంతి, సామరస్యం ఉన్నాయని చెప్పారు.
ఏవో కొన్ని ఘటనలు జరిగాయని రాద్ధాంతం చేయడం తగదన్నారు. మనది అత్యంత చలనశీలమైన ప్రజాస్వామ్యమని, కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక వంటి రాష్ర్టాల్లో జరిగిన ఘటనలకు కేంద్రానికి లంకె పెట్టడం భావ్యం కాదని జైట్లీ అన్నారు.
కాగా, నిస్పృహకు గురైన కొందరు భూస్వామ్యవాదులు అసహనం పేరిట దేశంలో సమైక్యత, శాంతి దెబ్బతీయాలని చూస్తున్నారని మరో కేంద్రమంత్రి ముక్తార్అబ్బాస్ నఖ్వీ ముంబైలో అన్నారు. బాలీవుడ్ నిర్మాతలు, రచయితలు, కళాకారుల సమావేశంలో మాట్లాడుతూ.. సంప్రదాయికంగా మోడీ, బిజెపి వ్యతిరేకులైనవారే ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: వెంకయ్య
దేశంలో మత అసహనం పెరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి భవన్కు నిర్వహించిన మార్చ్పై మోడీ సర్కారు, బిజెపి ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినవాళ్లే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, కాంగ్రెస్ వ్యవహారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు.
కాశ్మీరీ పండితులు వేరే ప్రాంతాలకు సామూహికంగా వలస వెళ్లాల్సిన పరిస్థితి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు, మోడీ సర్కార్కు సమస్యలు సృష్టించేందుకే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. రాజకీయ అసహనం కాంగ్రెస్ ‘జీన్స్'లోనే ఉందని, దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ అసహనం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
మన్మోహన్ సింగ్ మంత్రివర్గ నిర్ణయాలను చెత్తకుప్పలో పారేస్తానని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చెప్పిన విషయాన్ని మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు సిక్కుల ఊచకోతను సమర్థించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications