ఎవరికి లబ్ది.. ఎవరు జవాబుదారీ.. పుల్వామా దాడిపై మోదీని నిలదీసిన రాహుల్..
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను జైషే మహమ్మద్ పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దారుణ మారణకాండపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు. అసలు పుల్వామా దాడితో లబ్ది పొందెవరు అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. పుల్వామా దాడి విచారణలో అసలేం తేలిందని నిలదీశారు. దాడికి దారితీసిన భద్రతా లోపంపై బీజేపీ ప్రభుత్వంలో ఎవరు జవాబుదారీ? అంటూ వరుస ప్రశ్నలు గుప్పించారు.
ఆరోజు ఏం జరిగింది...
జమ్మూకశ్మీర్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై అవంతిపురా సమీపంలో ఫిబ్రవరి 14,2019న ఆత్మాహుతి దాడి జరింది. కాన్వాయ్లో మొత్తం 70 వాహనాలు ఉండగా.. అందులో 2500 మంది ప్రయాణిస్తున్నారు. ఇంతలో జైషే మహమ్మద్కి చెందిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ దాదాపు 350 కేజీల పేలుడు పదార్థాలతో స్కార్పియో కారులో వచ్చి సీఆర్పీఎఫ్ కాన్వాయ్ని ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించి 40 మంది జవాన్లు మృతి చెందారు.

తదనంతర పరిణామాలు
సీఆర్పీఎఫ్ దాడి తర్వాత ఫిబ్రవరి 27,2019న పాక్ యుద్ద విమానాలు భారత గగనతలంలోకి రావడాన్ని భారత వైమానిక దళం గుర్తించింది. పాక్ ఎఫ్-16 విమానాన్ని మిగ్-21 బైసన్ ఫైటర్తో కూల్చివేసింది. అయితే మిగ్-21 లోని పైలెట్ అభినందన్ మాత్రం పాకిస్తాన్ భూభాగంలో పడిపోయాడు. అయితే ఎట్టకేలకు పాకిస్తాన్ అభినందన్ను సురక్షితంగా భారత్కు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారత్లో అడుగుపెట్టిన తర్వాత ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏఎఫ్సీఎంఈ)కి తరలించారు. అక్కడ కూలింగ్ డౌన్లో భాగంగా పలు మెడికల్ టెస్టులతో పాటు డీబ్రీఫింగ్ చేశాయి. కొద్దిరోజుల అనంతరం అభినందన్ను అక్కడినుంచి ఇంటికి పంపించారు. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టడమే కాక, ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చేసినందుకు అభినందన్కు వీరచక్ర పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే.
నివాళులు అర్పించిన ప్రధాని,కేంద్రమంత్రులు
పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా,రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. వారి త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మరవదన్నారు.
మన మాతృభూమి కోసం,దేశ సమగ్రత కోసం త్యాగం చేసిన అమరులకు,వారి కుటుంబాలకు భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతుందని అమిత్ షా ట్వీట్ చేశారు. పుల్వామా ఘటన విషయంలో దేశం మొత్తం ఏకమైందని.. ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని తమ ప్రభుత్వం చిత్తశుద్దితో నిర్వహిస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications