షాహీన్బాగ్ శిబిరంలోకి బుర్ఖాతో చొరబడ్డ ఆ మహిళ ఎవరు.. ఆమె నేపథ్యం ఏమిటి..?
దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్బాగ్లో మరో కలకలం చోటు చేసుకుంది. బుర్ఖా ధరించి ఆందోళనకారుల శిబిరం వద్దకు వచ్చిన ఓ మహిళ.. నిరసనకారులను గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగడంతో ఆమెపై వారికి అనుమానం కలిగింది. దీంతో ఆమె బుర్ఖా తొలగించి చూడగా.. ముస్లిం మహిళ కాదని తేలింది. అంతేకాదు,ఆమె రహస్యంగా వీడియో చిత్రీకరిస్తున్నట్టు వారు గుర్తించారు. దీంతో కొంతమంది ఆందోళనకారులు ఆమెపై దాడికి యత్నించడంతో షాహీన్బాగ్లో కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను సురక్షితంగా అక్కడినుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే సీఏఏ ఆందోళన శిబిరంలోకి బుర్ఖా ధరించి వెళ్లాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది.. ఇంతకీ ఆమె ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎవరా మహిళ..
షాహీన్బాగ్ సీఏఏ ఆందోళన శిబిరంలోకి చొరబడ్డ ఆ మహిళను గుంజా కపూర్గా గుర్తించారు. ఆమె ఓ యూట్యూబర్. తన యూట్యూబ్ చానెల్ 'రైట్ నేరేటివ్'లో రైట్ వింగ్ పట్ల పక్షపాతంతో కూడిన రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. దేశంలో ప్రతీరోజూ జరిగే సంఘటనలపై గుంజా కపూర్ తన చానెల్లో విశ్లేషణలు అందిస్తుంటారు. 'కేజ్రీవాల్కు ఎంత ధైర్యం..','సీఏఏపై 9 సార్లు అబద్దాలు మాట్లాడిన కపిల్ సిబల్' వంటి వీడియోలు ఆమె యూట్యూబ్ చానెల్లో ఉన్నాయి. దీన్నిబట్టి ఆమె ఎవరి పక్షాన ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
గుంజా కపూర్ ఫాలోవర్స్లో మోదీ..
ట్విట్టర్లో గుంజా కపూర్కి 24వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేత తేజస్వీ సూర్య కూడా ఉండటం గమనార్హం. పలు ఆన్లైన్ వెబ్సైట్స్కి కూడా గుంజా కపూర్ కంట్రిబ్యూటర్గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఒడిశాలోని జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్ధి అయిన గుంజా కపూర్ పహ్లే ఇండియా ఫౌండేషన్లో భాగస్వామురాలు. గతంలో ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం,ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లపై కూడా ఆమె రీసెర్చ్ చేశారు.

ఆందోళన చెందుతున్న నిరసనకారులు..
ఏదేమైనప్పటికీ కపూర్ షాహీన్బాగ్కి మారువేషంలో వెళ్లి రహస్యంగా వీడియో చిత్రీకరించడంపై పలువురు ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో షాహీన్బాగ్లో నిరసనలు చేస్తున్న మహిళలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గుంజా కపూర్ పట్టుబడిన తర్వాత కోపోద్రిక్తులైన నిరసనకారులు దాడి చేయకుండా వారు ఆమెను రక్షించారు.

ఢిల్లీ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిన షాహీన్బాగ్..
షాహీన్బాగ్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు నిరసనకారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిన్నటికి నిన్న కపిల్ గుజ్జర్ అనే ఓ వ్యక్తి గన్తో కాల్పులకు పాల్పడగా.. ఈసారి బుర్ఖా ముసుగులో తమ శిబిరంలోకి ఓ మహిళ చొరబడటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. అంతకుముందు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు తాజా ఢిల్లీ ఎన్నికల్లో ఈ అంశాలన్నీ ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. షాహీన్బాగ్ అంశాన్ని బీజేపీ ఆమ్ ఆద్మీపై గురిపెడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications