బీహార్ ఎన్నికల చిత్రాలు- వ్యవసాయ బిల్లుల్ని పట్టించుకోని రైతులు- ఎందుకో తెలుసా ?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు పార్లమెంటులో తీవ్ర ఉత్కంఠ రేపాయి. ఎంత వ్యతిరేకత వచ్చినా చివరికి ఎలాగోలా కేంద్రం వీటికి ఆమోద ముద్ర వేయించుకుంది. అయితే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కౌంటర్ చట్టాలను తీసుకొచ్చేపనిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో సగానికి పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడిన బీహార్లో మాత్రం వీటి ప్రభావం కనిపించడం లేదు. దీని వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.

కనిపించని వ్యవసాయ చట్టాల ప్రభావం..
బీహార్ జనాభాలో దాదాపు సగం మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. దేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఉత్తర్ప్రదేశ్ తర్వాత బీహార్ ఐదో పెద్ద వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇక్కడ గ్రామీణ ప్రజల్లో ఎక్కువశాతం వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడిన వారే. కానీ కేంద్రం తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ప్రతికూల ప్రభావం మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. అటు విపక్ష మహాకూటమి కూడా వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం ఉద్యోగాలు, వలసల నివారణ వంటి అంశాల చుట్టూ మహాకూటమి ప్రచారం సాగిపోతోంది. దీంతో వ్యవసాయ చట్టాల గొప్పదనాన్ని చెప్పుకునేందుకు ఎన్డీయే కానీ వాటిపై వ్యతిరేకత పెంచేందుకు మహాకూటమి కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.

పట్టించుకోని రైతులు.. సంస్కరణలను పట్టించుకోని రైతులు..
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో ఈ రంగంలో భారీగా సంస్కరణలు అమలవుతాయని భావిస్తున్నా ఇక్కడి రైతులు మాత్రం ఈ మాటల్ని నమ్మేందుకు సిద్ధంగా లేరు. అలాగే వీటితో నష్టం జరుగుతుందని చెప్పినా పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ చేయడం ద్వారా వారికి లభిస్తున్న అత్యల్ప అదాయమే. ఏడాదంతా కష్టపడినా ఇక్కడి రైతులకు కడుపు నిండే పరిస్ధితులు లేవు. దీంతో ఈ చట్టాలు తమకు మేలు చేస్తాయని కానీ, నష్టం చేస్తాయని కానీ వారు భావించడం లేదు. అలాగే గ్రామీణ బీహార్లో సగటున రైతుకు కేవలం 0.242 హెక్టార్ల భూమి మాత్రమే ఉంది. ఇది దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలతో పోలిస్తే నాలుగో కనిష్టంగా నమోదైంది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో బీహార్లో ఏడాది మొత్తం పనిచేస్తే కేవలం 3 వేల రూపాయలు మాత్రమే సంపాదన ఉన్న రైతులు చాలా మంది ఉన్నారట.
Recommended Video

జమీందార్ల చేతుల్లోనే వ్యవసాయం..
బీహార్లో ఎక్కువశాతం భూములు కూడా పెద్ద పెద్ద భూస్వాములు, జమీందార్ల చేతుల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల చేతిలో కేవలం 17 శాతం భూములు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వ్యవసాయ చట్టాలను కానీ సంస్కరణలను కానీ సాధారణ రైతులు వ్యతిరేకించే పరిస్ధితులు లేవు. అలాగే బీహార్లో వ్యవసాయంపై పెట్టే ఖర్చు, దాని నుంచి లభించే సంపాదన కూడా బాగా తక్కువ. దీంతో వ్యవసాయాన్ని ఉపాధిగా భావించే వారు తక్కువ. సామాజిక, ఇతర పరిస్ధితుల ఆధారంగా మాత్రమే వ్యవసాయంపై ఇక్కడ ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో రైతులతో పోలిస్తే ఇక్కడి రైతులు వ్యవసాయంపై చేసే ఖర్చు, ఆర్జించే ఆదాయం తక్కువ. దీంతో వీరిపై సహజంగానే వ్యవసాయ సంస్కరణల ప్రభావం కూడా తక్కువగానే ఉంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు, అభ్యర్ధులు వ్యవసాయ చట్టాల ఊసెత్తకుండానే ప్రచారం చేసుకుంటూ పోతున్నారు.












Click it and Unblock the Notifications