ఎవరికీ భయపడొద్దు!: శశికళను ఎందుకు కలుస్తున్నారు?
తమిళనాడుకు చెందిన ప్రముఖ మీడియా సంస్థల వాళ్లు శశికళను కలుస్తున్నారు. ఆమెను కలుస్తున్న వారిలో మీడియా యజమానులు, ఎడిటర్లు ఉన్నారు.
చెన్నై: జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకే పగ్గాలు అనధికారికంగా శశికళ చేతుల్లోకి వెళ్లాయి. పార్టీలోని మెజార్టీ వర్గం శశికళను అధినేత్రిగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, మంత్రులు, ముఖ్య నాయకులు సహా పలువురు శశికళ వద్దకు క్యూ కడుతున్నారు. అన్నాడీఎంకే చీఫ్గా శశికళ ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది.
అదే సమయంలో పలు మీడియా సంస్థల ప్రముఖులు కూడా ఆమె వద్దకు వరుస కట్టడం గమనార్హం. తమిళనాడుకు చెందిన ప్రముఖ మీడియా సంస్థల వాళ్లు ఆమెను కలుస్తున్నారు. ఆమెను కలుస్తున్న వారిలో మీడియా యజమానులు, ఎడిటర్లు ఉన్నారు.
మీడియా ప్రతినిధుల క్యూ
ది హిందూ, తంతి టీవీ, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్ తదితరులు గత మూడు నాలుగు రోజులుగా ఆమెను కలుస్తున్నారు. శశికళ చాలా చురుకైన వారని, ఎడిటర్లు మరియు అధినేతలతో ఆమె సమావేశం ఆమె ఇమేజ్ను మరింత మెరుగుపరుస్తుందని ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు.
శశికళను కలవడం వెనుక..
పలువురు మీడియా ప్రముఖులు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను కాకుండా రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్న శశికళను కలవడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ సాగుతోంది. ఈ తర్కాన్ని తమిళనాడేతరులు అర్థం చేసుకోవడం కష్టమేనని అంటున్నారు. సంబంధం లేని వ్యక్తిని ఎందుకు కలుస్తున్నారోనని సీనియర్ జర్నలిస్ట్ రామసుబ్రమణియన్ అంటున్నారు.
పరువు నష్టం దావా
జయలలిత రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియా సంస్థల పైన పరువు నష్టం దావా కేసుల ట్రెండ్ జోరందుకుంది. తమిళనాడు ప్రభుత్వం తీరుకు మీడియా సంస్థలు నిరసన తెలిపాయి. అయితే, 2012 తర్వాత పరువు నష్టం దావాలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు కనిపించలేదు.
విన్ - విన్ పాలసీ
కొందరు చట్టపరంగా ఆ పరువు నష్టం కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు జయలలిత దెబ్బకు ప్రభుత్వం పైన విమర్శలు తగ్గించారని అంటారు. అప్పుడు ఒక్క కేసు కూడా ట్రయల్కు వెళ్లలేదు. అది జయలలిత ప్రభుత్వం యొక్క విన్ విన్ పాలసీ అంటారు.
మార్పులు!
తమిళనాడులో పలు మీడియా సంస్థలు ఓ పార్టీ వైపు పక్షపాతం చూపిస్తుంటాయనే వాదనలు ఉన్నాయి. తటస్థంగా ఉన్న మీడియాకు ఎప్పుడు చిక్కులు ఉంటాయని చెబుతుంటారు. దానిని దెబ్బతీసే ప్రయత్నాలు కూడా ఉంటాయన్నారు.
మీడియా భయపడవద్దని..
ప్రస్తుతం తమిళనాడులో రాజకీయాల్లో.. ముఖ్యంగా అన్నాడీఎంకేలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తమిళ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నట్లే, మీడియాలోని జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. పరువు నష్టం దావా కేసులు మీడియాకు ఇబ్బందికరమైనవి. వాటిని ఎదుర్కోలేకుంటే మూసేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. అయితే మీడియా పరువు నష్టం కేసులకు భయపడవద్దని మరో సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అంటున్నారు. జయ సీఎంగా ఉన్నప్పుడు ఇతను కూడా టార్గెట్ అయ్యాడు.