సాగు చట్టాలపై స్టే విధించినా.. ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు: రైతు సంఘాలపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే స్టే విధించామని.. ఆ చట్టాలు అమలులో లేనప్పుడు ఈ నిరసనలు తెలియజేయడం ఏంటని సుప్రీంకోర్టు రైతు సంఘాలను ప్రశ్నించింది. అంతేగాక, వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా మళ్లీ నిరసనలు చేస్తామనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతోందని నిలదీసింది.
కాగా, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత 'సత్యాగ్రహం' చేపట్టేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైతు సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీటిని విచారణ జరిపిన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
రైతు సంఘాలు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లఖింఫూర్ ఖేరీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు ముందు ప్రస్తావించారు. దీనిపై స్పందించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవ్వరూ బాధ్యత వహించరని అభిప్రాయపడింది.
ఏదైనా ఒక విషయంపై ఒకసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత.. మళ్లీ అదే సమస్యపై వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తామంటే వీలుకాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 21న చేపడతామని తెలిపింది. వీటితోపాటు సాగు చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ రాజస్థాన్ హైకోర్టులో రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా తమకే బదిలీ చేసుకుని విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
కాగా, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గడిచిన 11 నెలలుగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్ వద్ద శాంతియుత సత్యాగ్రహం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 200 మంది రైతులు పాల్గొని నిరసనలు తెలిపేలా కార్యక్రామన్ని రూపొందిస్తున్నారు. తమ ఆందోళనలకు అనుమతివ్వాలంటూ కిసాన్ మహాపంచాయత్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు 43 రైతు సంఘాలు ఇప్పటికీ ఆందోళన నిర్వహిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Recommended Video
మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి కాన్వాయ్లోని వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించారు. దీంతో ఆగ్రహం చెందిన కొందరు రైతులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దాడులకు పాల్పడటంతో మరో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ. 45 లక్షల పరిహారం, కుటుంబంలో ఓ వ్యక్తికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.