బీజేపీకి భారీ షాక్, పార్టీకి రామ్ మాధవ్ టీమ్ మెంబర్ గుడ్బై: మోడీ మంచి, చెడులు ఇవే...
న్యూఢిల్లీ: బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత రామ్ మాధవ్ టీమ్ మెంబర్లోని శివమ్ శంకర్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు, నేను బీజేపీకి ఎందుకు రాజీనామా చేస్తున్నానంటే..? అంటూ ఓ సుదీర్ఘ లేఖను రాశారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, రామ్ మాధవ్ టీంలో కీలక సభ్యుడిగా ఉన్న శివమ్ శంకర్ ఈ మధ్యే ఆ పార్టీకి రామ్ రామ్ చెప్పారు.
శివమ్ శంకర్ బీజేపీని ఏకిపారేశారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 2013లో తాను ఏ మోడీని చూసి బీజేపీపై అభిమానం పెంచుకున్నానో ఇప్పుడు అదే మోడీపై భరించలేక పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. మోడీ సర్కార్ చేసిన మంచి, చెడు, దారుణంగా విఫలమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆయన సుదీర్ఘ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఏం రాశారంటే..

ఏ పార్టీ కూడా పూర్తిగా మంచిది కాదు, చెడ్డది కాదు
'దేశంలో రాజకీయపరమైన చర్చ అనే అంశం చాలా తక్కువగా ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రజలు తమకు నచ్చిన వారికి మద్ధతిస్తున్నారు. కొందరు బూటకపు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నా ఎలాంటి పశ్చాత్తాపం లేదు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, ఓటర్లు, మద్దతుదారులు కారణం. నాలుగేళ్ల బీజేపీ పాలనలో అనేక విధాలుగా అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. అయితే గత ప్రభుత్వాల కంటే భిన్నంగా లేదు. అన్ని ప్రభుత్వాలు కొన్ని మంచి పనులు చేశాయి అన్నది నా అభిప్రాయం. అయితే, కొన్ని అవాస్తవ ప్రచారాలు చేస్తోంది. అందుకే నేను బీజేపీకి మద్దతు ఇవ్వడం లేదు.

బీజేపీ చేసిన మంచి పనులు
1. గతంలో కంటే రోడ్ల నిర్మాణం వేగంగా జరిగింది. నలుమూలలా జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరగడం దేశాభివృద్ధికి మంచిది. 2. దేశంలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పెరిగింది. మోడీ హయాంలో అన్ని గ్రామాలకు విద్యుత్ అందుతోంది. అంతేకాదు, ఎక్కువ సమయం విద్యుత్ వస్తోంది. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న పల్లె ప్రాంతాలకు వెలుగు వచ్చింది. 3. కేంద్రంలో అగ్రస్థాయిలో అవినీతి పూర్తిగా తగ్గిపోయింది. కేంద్ర మంత్రిత్వశాఖలకు సంబంధించి ఎటువంటి పెద్ద కుంభకోణాలు జరగకపోవడమే దీనికి ఉదాహరణ. 4. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతమైంది. దేశ ప్రజల మనస్సుల్లో స్వచ్ఛత అన్న అంశం మమేకమైంది.

లా అండ్ ఆర్డర్ బాగుంది
5. ఉజ్వల యోజన అద్భుతం. కానీ రెండో సిలిండరును బయట చాలామంది కొనుగోలు చేసారు. మొదటిసారి స్టవ్ ఉచితం. కానీ ఆ తర్వాత కొనుక్కోవాల్సి వస్తోంది. 6. ఈశాన్య భారతంతో అనుసంధానానికి వీలుగా రైలు మార్గాలు, రహదారులు పెద్ద ఎత్తున నిర్మించడం శుభపరిమాణం. 7. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే బీజేపీ పాలనలో లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది.

ఎలక్ట్రోరల్ బాండ్స్, ప్రణాళికా సంఘం రద్దు, నోట్లరద్దు, జీఎస్టీ
మోడీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఎలక్ట్రోరల్ బాండ్స్ వల్ల అవినీతి చట్టబద్దం అవుతుంది. పార్టీకి విరాళాలు ఇచ్చే వాళ్ల వివరాలు చెప్పవలసిన అవసరం లేదు. దీంతోనే ఎలక్ట్రోరల్ బాండ్ల డొల్లతనం బయటపడుతుంది. రాళాన్ని ఇచ్చే వారు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించి తమకు అనుకూలమైన విధానాలను తీసుకువచ్చేందుకు వీలుగా రాజకీయపక్షాలపై ఒత్తిడి చేసే ప్రమాదముంది. రెండోది, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం పెద్ద తప్పిదం. దీని వల్ల ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుసుకునే వీలు లేకుండా పోయింది. సీబీఐ, ఈడీలాంటి విచారణ సంస్థలను మోడీ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోంది. ఎదురు తిరిగిన వాళ్లపై వీటిని ఉసిగొల్పుతోంది. నోట్ల రద్దు, జీఎస్టీలు విఫలమయ్యాయి. దీనిని బీజేపీ అంగీకరించడం లేదు. ఈ రెండింటి వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది.

విదేశాంగ విధానం, భారతీయుల పట్ల చులకన భావం పోయింది... మోడీ వల్ల కాదు
ఎప్పుడు విదేశాల్లో పర్యటిస్తున్న మోడీ హయాంలోను విదేశాంగ విధానం విఫలమైంది. శ్రీలంకలోని నౌకాశ్రయాన్ని చైనా ఆధీనంలోకి తీసుకోవడం, బంగ్లాదేశ్లో చైనా ప్రభావం పెరగడం, మాల్దీవుల్లో భారత కార్మికులకు వీసా ఇవ్వకపోవడం... తదితర అంశాలు విదేశాంగ విధానం సక్రమంగా లేదని చెబుతున్నాయి. భారతీయుల పట్ల చులకన భావం పోగొట్టానని బీజేపీ చెబుతోంది. అది వాస్తవమే. కానీ దశాబ్దాలుగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వల్ల అది సాధ్యమైంది. అయితే, మోడీ వచ్చాకే భారతీయుల పట్ల గౌరవం పెరిగిందనడానికి యోగా డే, భారత్తో పలు దేశాలకు సంబంధాలు మెరుగుపడటం నిదర్శనమని మరికొందరు అంటున్నారు.

ఈ కారణాలతో బీజేపీ నుంచి వెళ్లిపోతున్నా
సన్సద్ గ్రామ్ యోజన, ఫసల్ బీమా యోజన, మేకిన్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్ దారుణంగా విఫలమయ్యాయి. నిరుద్యోగం, రైతు సమస్యలను గాలికి వదిలేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కాగా, పెట్రో ధరలు తగ్గించకపోవడానికి జైట్లీ కారణం చెప్పారని, పైగా యూపీఏ చేసిన అప్పులను తీర్చారని మరికొందరి వాదన. ఇంకా, శివమ్ శంగర్ సింగ్.. విద్య, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు.
కేంద్రప్రభుత్వ ప్రకటనలకే 4 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ప్రజల మధ్య విషబీజాలు నాటడం ఎంతో బాధను కలిగిస్తోందన్నారు. ఇన్ని పరిణామాలు చూసిన అనంతరం బీజేపీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జడ్జి లోయా కేసును, ఉన్నావ్ రేప్ కేసును ఇలా పలు అంశాలను ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications