శతృవుకు శతృవు మిత్రుడైనట్టు: చైనాకు చెక్..భారత్ బిగ్ స్కెచ్: నిశితంగా గమనిస్తోన్న డ్రాగన్
న్యూఢిల్లీ: భారత్.. తన పొరుగుదేశం చైనాతో సుదీర్ఘకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. లఢక్ తూర్పు ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సహా సరిహద్దు పొడవునా ఉద్రిక్త పరిస్థితులకు చైనా కారణమౌతోంది. లఢక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో తరచూ గొడవలకు దిగుతోంది. భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తూ.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే సమయంలో- సరిహద్దులకు సమీపంలో గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తోంది. వైమానిక దళ రాకపోకలు సాగించడానికి కొత్తగా ఎయిర్ బేస్లను సైతం సిద్ధం చేసుకుంటోంది.
డ్రాగన్ బుసలతో..
ఈ పరిణామాలు భారత్కు ఇబ్బందికరంగా పరిణమించాయి. చైనా దూకుడును అడ్డుకోలేకపోతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నప్పటికీ.. అది తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తోందే తప్ప శాశ్వతంగా అడ్డుకట్ట వేయలేకపోతోంది. భౌగోళికంగా, ఆర్థికపరంగానూ భారత్కు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. దక్షిణ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యాన్ని సాధించడానికి ఈ డ్రాగన్ కంట్రీ సాగిస్తోన్న ప్రయత్నాలు ఒక్క భారత్కు మాత్రమే కాదు.. ఈ రీజియన్లో ఉన్న మిగిలిన దేశాలను కూడా మింగుడు పడట్లేదు.
కొత్త కూటమిలో భారత్..
ఈ పరిణామాల మధ్య భారత్- ఓ ముందడుగు వేసింది. ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో చైనాకు మూకుతాడు వేయడానికి ఈ రీజియన్కు చెందిన దేశాల సహకారాన్ని తీసుకుంది. కొత్తగా ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ (ఐపీఈఎఫ్) పేరుతో ఏర్పాటైన సరికొత్త కూటమిలో చేరింది. ఈ కూటమికి అమెరికా నాయకత్వాన్ని వహించనుంది. జపాన్లో క్వాడ్ సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు.
13 దేశాలతో..
13 దేశాలతో కూడిన ఐపీఈఎఫ్ కూటమి ఇది. ఇలాంటిది ఒకటి ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఈ కూటమిలో భారత్, అమెరికా సహా ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండొనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం చేరాయి. ప్రపంచ జీడీపీలో ఈ 13 దేశాల స్థూల జాతీయోత్పత్తి వాటా ఏకంగా 40 శాతం. ఇండో- పసిఫిక్ రీజియన్లో చైనా ఆర్థిక స్థితిని మించిపోవాలనే లక్ష్యంతో ఆది ఏర్పాటైంది. ఒకే రీజియన్కు చెందిన ఆయా దేశాలన్నీ జట్టు కట్టడం చైనాకు ఒకింత ఇబ్బంది కలిగించే విషయమే.
త్రీ-టీస్..
ట్రస్ట్-ట్రాన్స్పరెన్పీ-టైమ్లైన్స్.. ఇది ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. త్రీ టీస్ లక్ష్యంతో తాము పని చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ కూటమి దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి తెర తీస్తామని, ఇదే రీజియన్లో ఉన్న ఇతర దేశాలను కూడా కలుపుకొని బలమైన ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదుగుతామని పేర్కొన్నారు. ఆయా దేశాల మధ్య ఎకనమిక్ కనెక్టివిటీ, ఇంటిగ్రేషన్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్ వంటి అంశాలపై తరచూ సంప్రదింపులు జరుతుంటామని వ్యాఖ్యానించారు.
చైనాకు ప్రత్యామ్నాయమే..
చైనాకు ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదిగడానికే ఐపీఈఎఫ్ను ఏర్పాటు చేశామని అమెరికా వాణిజ్య కార్యదర్శి గీనా రైమొండో స్పష్టం చేశారు. చైనా బయటి దేశాల్లో తమ ఉత్పాదక శక్తిని పెంచాలని యాపిల్ నిర్ణయించిందని, పలు అమెరికన్ కంపెనీలు కూడా ఇలాంటి చర్యలను తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. భారత్, వియత్నాం, మలేసియా, ఇండొనేషియా వంటి దేశాలకు ఇది లాభిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సుస్థిరతకు దారి తీస్తుందని చెప్పారు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండో-పసిఫిక్ దేశాలు ఎదగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నిశితంగా గమనిస్తోన్న చైనా..
కాగా- ఈ పరిణామాలను చైనా నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికే ఈ కూటమిని ఏర్పాటు చేసిందనే అభిప్రాయంలో ఉంది. ఇండో-పసిఫిక్ రీజియన్లో తాను బలమైన ఆర్థికశక్తిగా ఎదగడాన్ని అగ్రరాజ్యం సహించలేకపోతోందనే వాదన చైనా ప్రభుత్వ పెద్దల నుంచి వినిపిస్తోంది. తనను ఎదుర్కొనడానికే ఈ కూటమిని ఏర్పాటు చేసిందని భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు.