దేశానికి 35 ట్యాంకర్ ట్రక్కుల బ్లడ్ అవసరం : ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ : దేశంలో 35 ట్యాంకర్ ట్రక్కుల రక్తం అత్యవసరమన్న విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దేశంలో రక్తం కొరతకు సంబంధించి గత జూలైలో కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జే.పి.నడ్డా చేసిన ప్రకటన ద్వారా 'బ్లడ్ కొరతపై చర్చ' చర్చనీయాంశంగా మారింది.
మంత్రి జేపీ నడ్డా ప్రకటించిన లెక్కల ప్రకారం.. దేశంలో 1.1 మిలియన్ల యూనిట్ల రక్తం కొరత దేశంలో ఉన్నట్లు గత నెలలో ప్రకటించారు. యూనిట్ కు 350 మి.లీ లేదా 450మి.లీ చొప్పున లెక్క కడితే దేశంలో ఈ స్థాయి రక్త కొరత ఉన్నట్లు తేలిందన్నారు. అయితే మంత్రి గారు చెప్పిన లెక్కలను ట్యాంకర్స్ లెక్కల కిందకు తర్జుమా చేస్తే.. దేశంలో 35 ట్రక్కుల ట్యాంకర్ల రక్తం అత్యవసరమన్నట్లు తేలింది.
అంటే.. యూనిట్ కు 350మి.లీ రక్తం చొప్పున 11వేల లీటర్ల సామర్థ్యమున్న రక్తం ట్యాంకర్లు ఇప్పుడు దేశానికి అవసరం. మొత్తంగా అవసరం కంటే 9శాతం మేర రక్తం సరఫరా కొరత దేశంలో ఉంది. 2013-14లో అవసరాని కంటే 7శాతం తక్కువున్న రక్తం సరఫరా, 2015-16లో మరింతగా తగ్గి 9శాతంగా ఉండడం గమనార్హం.
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ రక్త సరఫరా కొరత ఉన్న రాష్ట్రం బీహార్. బీహార్ లో 84శాతం రక్తం కొరత ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఛత్తీస్ ఘర్ 66 శాతం, అరుణాచల్ ప్రదేశ్ 64 శాతం ఉన్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,708 బ్లడ్ బ్యాంక్ సెంటర్లు ఉండగా.. 81 జిల్లాల్లో అసలు ఒక్క బ్లడ్ బ్యాంక్ సెంటర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇందులో ఛత్తీస్ ఘర్ అగ్రస్థానంలో ఉంది. ఛత్తీస్ ఘర్ లోని 11 జిల్లాల్లో అసలు ఒక్క బ్లడ్ బ్యాంక్ సెంటర్ కూడా లేదు. అలాగే అస్సాంలోని 9 జిల్లాల్లో, అరుణాచల్ ప్రదేశ్ లోని 11జిల్లాల్లో బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ లేవు.

బాంబే ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ చైర్ పర్సన్ మరియు పాథాలజిస్ట్ జరీన్ బరుచా మాట్లాడుతూ.. ఇండియాలో రక్తదానం చేస్తున్న చాలామంది వ్యక్తులు తమ కులం లేదా మతానికి చెందిన వ్యక్తులకే రక్త దానం చేస్తున్నట్లుగా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్త సరఫరా కొరత తీవ్రంగా ఉందని, 70శాతం దేశ ప్రజలు గ్రామాల్లో ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరముందని అన్నారు.
రక్త సేకరణలో చోటు చేసుకుంటున్న పలు తప్పిదాలు కూడా రక్తం కొరతకు దారితీస్తున్నట్లుగా జరీన్ తెలిపారు. రక్త సేకరణ లాంటి కార్యక్రమాలను దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సింది పోయి, ఒకేసారి ఎక్కువ మొత్తంలో రక్తం సేకరించడం ద్వారా కూడా రక్తం వ్రుథాగా మిగిలిపోతున్నట్లు జరీన్ చెప్పుకొచ్చారు.
2011-15 మధ్య కాలంలో ముంబైలో ఉన్న 63 బ్లడ్ బ్యాంక్ సెంటర్లు లక్షా 30వేల లీటర్ల రక్తాన్ని వ్రుథా చేసినట్లు జరీన్ చెప్పారు. ఎక్కువ రోజుల పాటు నిలువ చేయడంతో.. ఆ రక్తం పనికిరాకుండా పోయిందన్నారు.
కాగా, దేశంలో రక్త దానం పట్ల అవగాహన పెరుగుతున్నట్లు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ సంస్థ లెక్కల ప్రకారం.. దేశంలో 2006లో 54శాతంగా ఉన్న రక్త దాతలు, 2013-14 నాటికి 84శాతంకు పెరిగారు. ఇక డబ్బు ఇచ్చి దాత నుంచి రక్తం సేకరించే పద్దతిని సుప్రీం కోర్టు 1996లోనే నిషేధించినప్పటికీ అదే పరిస్థితి ఇంకా కొనసాగుతోంది.
అయితే ఇలాంటి పరిస్థితి క్షేమకరం కాదని.. పెయిడ్ డోనార్స్ రక్తాన్ని ఎలాంటి టెస్టులు నిర్వహించకుండా ఎక్కించడం, లేక తప్పుడు మెడికల్ ధ్రువ పత్రాలను చూసి రక్తాన్ని కొనుగోలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు జరీన్.
2015 జనవరిలో బీబీసీ వెలువరించిన ఓ కథనం ప్రకారం.. దేశంలో రక్తం కొరతకు బ్లాక్ మార్కెట్ కూడా ఓ కారణం. అప్పట్లో.. 17మంది పిల్లలను కిడ్నాప్ చేసిన కొంతమంది కిడ్నాపర్లు, కిడ్నాప్ చేసిన పిల్లలను రక్త సేకరణకు ఉపయోగించుకున్నారు. అలా.. రెండున్నర సంవత్సరాల పాటు వాళ్ల రక్తాన్ని ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
ఒకసారి రక్తదానం చేసిన వ్యక్తి మళ్లీ 8 నుంచి 12 నెలల వరకు ఆ రక్త దానానికి దూరంగా ఉండాలని రెడ్ క్రాస్ సొసైటీ చెబుతుండగా.. సదరు కిడ్నాపర్స్ మాత్రం కిడ్నాప్ చేసిన పిల్లల నుంచి వారానికి మూడు సార్లు రక్తాన్ని సేకరించేవారని సమాచారం.
కేవలం మెడికల్ రంగం విస్తరించడం.. ఎక్కువగా సర్జరీలు జరుగుతుండడం లాంటి కారణాలు మాత్రమే రక్త సరఫరా కొరతకు కాదన్న జరీన్.. రక్త దానంపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఇందుకో కారణమన్నారు. ఒక్కో వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసే దిశగా చర్యలు తీసుకుంటే..దేశంలో ఈ సమస్యను అధిగమించవచ్చని జరీన్ తెలియజేశారు.












Click it and Unblock the Notifications