ముజఫూర్పూర్ షెల్టర్ హోం కేసులో నిందితురాలు... అయినా ఎమ్మెల్యే టికెట్... నితీశ్ వ్యూహమేంటి..?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్పూర్ షెల్టర్ హోం కేసులో నిందితురాలైన మాజీ మంత్రి మంజు వర్మకు జేడీయూ తరుపున అసెంబ్లీ టికెట్ కేటాయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో మంజు వర్మపై ఆరోపణల నేపథ్యంలో గతంలోనే పార్టీ ఆమెపై వేటు వేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించింది. అలాంటిది,ఇప్పుడు అదే పార్టీ తిరిగి ఆమెకు టికెట్ ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. బాలికల పట్ల లైంగిక వేధింపులు,అత్యాచారాలకు సంబంధించిన కేసులో నిందితురాలికి అధికార పార్టీ టికెట్ ఇవ్వడం వెనుక అసలు లెక్కేంటి అన్న చర్చ జరుగుతోంది..
మళ్లీ ఆమెకే ఎందుకు...?
జేడీయూ తరుపున బెగుసరై జిల్లాలోని చెరియా బరియర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంజు వర్మ పోటీ చేయనున్నారు. గతంలో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఆమె వరుసగా రెండుసార్లు గెలుపొందారు. ముజఫర్పూర్ షెల్టర్ హోమ్ కేసులో నిందితుడైన మంజు వర్మ భర్త,వామపక్ష నేత చంద్రశేఖర్ వర్మకు ఇక్కడ మంచి పట్టు ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఇక్కడ పొలిటికల్ యాక్టివిస్టులుగా పనిచేస్తూ వచ్చారు.పైగా సామాజికవర్గం కూడా మంజువర్మకు కలిసొచ్చింది.ఇక్కడ ఆధిపత్యం కుష్వాహా సామాజికవర్గానిదే కావడంతో జేడీయూ ఆమెకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది.ముజఫర్పూర్ కేసులో మంజు వర్మ అమాయకురాలని ఆ సామాజికవర్గం భావిస్తోంది.
గెలుపు గుర్రం...
బరియర్పూర్ నియోజకవర్గంలో మంజు వర్మ పాపులారిటీ కూడా ఆమెకు టికెట్ ఇచ్చేందుకు కారణమైంది. ముజఫర్పూర్ షెల్టర్ హోమ్ కేసులో ఆమె అరెస్టయిన సమయంలో స్థానికులు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే బెయిల్పై విడుదలయ్యాక మంజు వర్మ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం జేడీయూ కసరత్తులు మొదలుపెట్టడంతో మళ్లీ ఆమె పేరు తెర పైకి వచ్చింది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి,పార్టీ అధినేత నితీశ్ కుమార్ను కూడా మంజు వర్మ కలిశారు. నిజానికి ఆ సమయంలో నితీశ్ ఆమె పట్ల అసంతృప్తితోనే ఉన్నప్పటికీ... ఆ తర్వాత టికెట్ మాత్రం ఆమెకే కేటాయించారు. ముజఫర్పూర్ కేసులో మంజు వర్మ నిందితురాలే అయినప్పటికీ... జేడీయూ మాత్రం తమకు గెలుపు గుర్రాలే ముఖ్యమని భావిస్తుండటంతో మరోసారి టికెట్ ఆమెకే దక్కింది.
ప్రస్తుతం బెయిల్పై..
పొలిటికల్ యాక్టివిస్ట్ అయిన మంజు వర్మకు బరియర్పూర్లో ఉన్న పాపులారిటీని గమనించి 2010లో నితీశ్ కుమార్ మొదటిసారి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికలతో పాటు ఆ తర్వాతి ఎన్నికల్లోనూ మంజు వర్మ గెలుపొందారు. రెండోసారి గెలిచాక నితీశ్ కేటినెబ్లో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే క్రమంలో ముజఫర్పూర్ షెల్టర్ హోమ్లో 34 మంది బాలికలపై లైంగిక వేధింపులు,అత్యాచారాల ఘటన వెలుగుచూసింది. మంజు వర్మ మంత్రిగా ఉన్న శాఖ నుంచే ఆ షెల్టర్ హోమ్కు నిధులు మంజూరు అవడంతో ఆమెపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆమె భర్త చంద్రశేఖర్ వర్మ కూడా అప్పుడప్పుడు ఆ షెల్టర్ హోమ్కు వెళ్తుండటంతో ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మంజు వర్మ,ఆమె భర్తతో సహా మరో 11 మందిపై అభియోగాలు మోపింది.
Recommended Video
మంజు వర్మకు టికెట్... హాట్ టాపిక్...
ప్రస్తుతం మంజు వర్మ,చంద్రశేఖర్ ఇద్దరూ బెయిల్పై బయట ఉన్నారు. కేసుపై సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. విచారణ ఇంకా ఓ కొలిక్కి రాకముందే ఓ నిందితురాలికి జేడీయూ టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జేడీయూ తమ రెండో జాబితాలో మంజు వర్మకు టికెట్ ఖరారు చేసింది. అలాగే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు పిల్లనిచ్చిన మామ చంద్రికా రాయ్కి కూడా జేడీయూ టికెట్ ఇవ్వడం గమనార్హం.