సభకు డుమ్మా ఎందుకు: సెలవు అడిగిన రాహుల్, సరేనని సోనియా
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తనకు కొన్నాళ్ల పాటు రాజకీయాలకు సెలవు కావాలని తన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు! ఈ బడ్జెట్ సమావేశాలకు రాహుల్ దూరంగా ఉండనున్నారు. రాజకీయాల నుండి తనకు కొన్ని వారాల పాటు సెలవు కావాలని రాహుల్ కోరారని వార్తలు వస్తున్నాయి.
ఆయనకు సోనియా గాంధీ అనుమతి కూడా ఇచ్చారని చెబుతున్నారు. తనకు కొంతసమయం కావాలని రాహుల్ కోరగా ఆమె సరేనని చెప్పారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. కొద్ది రోజులు దూరంగా ఉంటారని, తిరిగి పార్టీలో ఉత్సాహంగా పని చేస్తారని భావిస్తున్నానని చెప్పారని సమాచారం.
అయితే, రాహుల్ గాంధీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడం పైన రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారంటున్నారు. కీలకమైన బడ్జెట్ సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ దూరంగా ఉండటం సరికాదని చాలామంది భావిస్తున్నారు.
ఏడాదిగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేని విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలో నరేంద్ర మోడీ హవాకు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీ సత్తా చాటింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలవలేదు. కాగా, సోమవారం ప్రారంభమైన సమావేశాలకు రాహుల్ హాజరు కాలేదు.