కుతుబ్ మినార్ మీద ఎందుకీ వివాదం?
దిల్లీలో అత్యంత ప్రసిద్ధి చెందిన, అద్భుతమైన కట్టడాలలో కుతుబ్ మినార్ ఒకటి. ఇది 240 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటుంది.
ఈ స్మారక కట్టడం చుట్టూ ఉన్న కాంప్లెక్స్ ఆవరణలో వందల ఏళ్ల కిందట కూల్చివేసిన దేవాలయాలను పునరుద్ధరించాలా వద్దా అనే అంశాన్ని ఇప్పుడు కోర్టు నిర్ణయించనుంది.
1192లో హిందూ పాలకులపై సాధించిన విజయానికి గుర్తు (టవర్ ఆఫ్ విక్టరీ)గా దిల్లీ మొదటి సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ ఈ కట్టడాన్ని నిర్మించారు. బహుశా ఆఫ్గాన్ మినార్లను ప్రేరణగా తీసుకొని దీన్ని నిర్మించి ఉండొచ్చు. ఈ విజయ గోపురానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమనే గుర్తింపు ఉంది.
ఎరుపు ఇసుకరాయితో నిర్మించిన ఈ స్మారక చిహ్నంలో ముస్లిం పాలనకు చెందిన కొన్ని పురాతన నిర్మాణాలు ఉన్నాయి. ఇది నిలువుగా విస్తరించి ఉంది. ఐబక్ దీన్ని నిర్మించిన తర్వాత ముగ్గురు రాజులు దీన్ని పునర్నిర్మించారు. ఇప్పుడు ఇది ఐదు అంతస్థులతో 379 మెట్లను కలిగి ఉంది.
''లెన్స్ కింది వైపుకు ఉన్నట్లు, పూర్తిగా తెరుచుకున్న టెలిస్కోప్లా కనిపించే కుతుబ్ మినార్... ఘనమైన, విజయవంతమైన ఆగమన ప్రకటన'' అని చరిత్రకారుడు విలియం డాలింపుల్ వర్ణించారు.
ఈ మినార్ ఉన్న కాంప్లెక్స్కు ఒక చరిత్ర ఉంది. ఆ కాంప్లెక్స్లో ఉన్న 27 హిందు, జైన దేవాలయాలను కూల్చివేసి వాటి శిథిలాలతో దిల్లీలో మొదటి మసీదును ఆ ప్రదేశంలోనే నిర్మించారని చరిత్ర చెబుతోంది.
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సీనియర్ అధికారి జేఏ పేజ్, ఈ స్మారక చిహ్నంపై నివేదించిన 1926 నోట్ ప్రకారం... ఆ కాంప్లెక్స్లోని ఒక దేవాలయానికి చెందిన ఒక స్తంభాన్ని అలాగే ఉంచి మసీదును నిర్మించారు. 'శకలాలను కూర్చి చేసిన నిర్మాణంగా' ఆయన దీన్ని పేర్కొన్నారు.
- ఉర్దూ భాష మీద హిందూవాదులకు కోపమెందుకు?
- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఔరంగాబాద్లో ఎందుకు నిర్మించారు?
ఆ కాంప్లెక్స్లో మినార్తో పాటు చాలా నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో 1600 ఏళ్ల నాటి 20 అడుగుల ఎత్తైన ఇనుప స్థంభం కూడా ఒకటి. ఇది కాలం, ప్రకృతి విధ్వంసాలను తట్టుకొని నిలిచింది. అయిదు తోరణాలతో పాటు సుల్తానులలో ఒకరి సమాధి కూడా అక్కడ ఉంది.
హిందు, ముస్లింలకు చెందిన మోటిఫ్స్తో కాంప్లెక్స్లోని నిర్మాణాలను అలంకరించారు. దిల్లీకి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక అవశేషాలు, స్మారక చిహ్నాల సమూహంలో ఉన్నాయని తన నోట్లో జేఏ పేజ్ పేర్కొన్నారు.
దాదాపు 800 ఏళ్ల తర్వాత, కాంప్లెక్స్లోని 27 దేవాలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్తో భారతదేశంలోని కోర్టులు ఇప్పుడు కుస్తీ పడుతున్నాయి.
''భారతదేశాన్ని అనేక రాజవంశాలు పాలించాయనీ, గతంలో జరిగిన తప్పులు ఇప్పటి మన శాంతికి భంగం కలిగించడానికి ఆధారం కావు'' అని పేర్కొంటూ నవంబర్లో ఒక సివిల్ కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది.
ఇప్పుడు పిటిషనర్ ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేశారు. "మసీదు కంటే చాలా కాలం ముందే అక్కడ ఆలయం ఉన్నప్పుడు, దాన్ని ఎందుకు పునరుద్ధరించలేరు?" అని ఇప్పటికీ ఆ కాంప్లెక్స్లో హిందు దేవతలు ఉన్నారని నమ్మే హరి శంకర్ జైన్ ప్రశ్నించారు. సమాఖ్య చట్టం ప్రకారం రక్షిత స్మారక చిహ్నాల జాబితాలో ఈ కట్టడం కూడా ఉంది. దీని స్థితి గురించి పురావస్తు శాస్త్రవేత్తలు స్పష్టతతో ఉన్నారు. అది మునుపటి స్థితిని తిరిగి పొందలేదని వారు అంటున్నారు.
వారణాసి, మథుర నగరాల్లో కూల్చివేసిన హిందూ దేవాలయాలపై నిర్మించిన మసీదుల విషయంలో కూడా ఇలాంటి వివాదాలే రాజుకుంటున్నాయి.
12వ శతాబ్దం చివరి నుంచి ముస్లిం రాజులు, కనీసం 7వ శతాబ్దం నుంచి హిందూ రాజులు... శత్రు రాజులు పోషించిన దేవాలయాలను దోచుకొని పునర్నిర్మించడం లేదా ధ్వంసం చేశారని చరిత్రకారులు చెబుతున్నారు.
"అతిపెద్ద మత చిహ్నాలుగా విలసిల్లుతున్న వాటిని నాశనం చేయడం ద్వారా ప్రతీ పాలకుడు తన రాజకీయ అధికారం, సామ్రాజ్య బలం ముద్రను వేయడానికి ప్రయత్నించారు. అన్ని ఆలయాలు ధ్వంసం కాలేదు, కేవలం రాజకీయ ప్రాధాన్యం ఉన్నవి మాత్రమే ఇలా అయ్యాయి'' అని చరిత్రకారులు రాణా సఫ్వీ చెప్పారు.
- తాజ్ మహల్: 'మూసి ఉన్న గదుల్లో దాగిఉన్న ఆ రహస్యాలు ఏంటంటే..’
- దేశద్రోహం: బ్రిటిష్ కాలం నాటి చట్టం ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటి?
కుతుబ్ మినార్ను ఎందుకు నిర్మించారు? సఫ్వీ చెప్పిన ఒక కారణం ఏమిటంటే, కాంప్లెక్స్లోని మసీదుకు మినార్గా పనిచేయడం కోసం. ఈ మినార్ను రోజూవారీ ప్రార్థనల కోసం ఇతరులను పిలవడానికి మతపెద్ద ఉపయోగించుకునేవారు.
శత్రు కదలికలను ట్రాక్ చేయడానికి మిలిటరీ వాచ్టవర్గా ఉపయోగించడం కోసం దీన్ని నిర్మించి ఉండొచ్చదనేది మరో వాదన. వీటన్నింటి కంటే నమ్మదగిన మరో కారణం ఏంటంటే దీన్ని విజయానికి గుర్తుగా విజయం గోపురంగా నిర్మించి ఉంటారని అంటారు.
దృఢమైన ఈ గోపురం రెండు పిడుగులను తట్టుకొని నిలిచింది. ఒక పిడుగు కారణంగా మినార్లోని నాల్గవ అంతస్థు దెబ్బతింది. దీంతో పాలరాయితో సుల్తాన్ దాన్ని మరమ్మతు చేసి అదనంగా మరో రెండు అంతస్థులను నిర్మించారు. పైభాగంలో 12 అడుగుల ఎత్తుతో ఒక కుపోలాను నిర్మించారు. కానీ, భూకంపం కారణంగా అది కూలిపోయింది. కుతుబ్ మినార్ రెండు భూకంపాలను ఎదుర్కొంది.
1977లో మినార్ని మొదటగా చూసినప్పటి జ్ఞాపకాలను సఫ్వీ గుర్తు చేసుకున్నారు. "నేను మొదటి అంతస్థు ఎక్కి చుట్టుపక్కల ఉన్న అందమైన గ్రామీణ ప్రాంతాలను చూశాను. 1960లలోనే మేము అక్కడికి వెళ్లి మినార్ పై భాగానికి ఎక్కినట్లు మా అక్కవాళ్లు చెబుతుంటారు. కుతుబ్ మినార్ ఒక ప్రసిద్ధ విహార ప్రదేశంగా ఉండేది. కానీ, 1981లో మినార్లోని ఇరుకైన మెట్ల మీద జరిగిన తొక్కిసలాటలో 45 మంది మరణించడంతో ఆ తర్వాత నుంచి సందర్శకులను పైకి అనుమతించట్లేదు'' అని సఫ్వీ చెప్పుకొచ్చారు.
- మాస్టర్జీ ఫోటో ఎగ్జిబిషన్: బ్రిటన్కు వలస వెళ్లిన తొలి తరం భారతీయుల అరుదైన చిత్రాలు
- పంది, జింక వృషణాలను పొడి చేసుకుని తింటే మగాళ్లలో సంతాన శక్తి కలుగుతుందా, మధ్య యుగాల నాటి వైద్య గ్రంథాల్లో రాసి ఉన్నది ఎంత వరకు నిజం?
ఈ స్మారక చిహ్నం స్విస్ చిరుతిళ్లు లభించే, ఉన్నత స్థాయి దుకాణాలతో కూడిన పరిసర ప్రాంతంలో ఉంది. అక్కడి రూఫ్టాప్ బార్లు, లాంజ్లు, రెస్టారెంట్ల నుంచి మినార్ కనిపిస్తుంటుంది.
ఈ నెల ప్రారంభంలో కాంప్లెక్స్ బయట నినాదాలు చేసినందుకు హిందూ మితవాద గ్రూపు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
''కూల్చివేతకు గురైన ఆలయం తన స్వభావాన్ని, దైవత్వాన్ని, పవిత్రతను కోల్పోదు" అని గతవారం కోర్టులో పిటిషనర్ జైన్ అన్నారు. కుతుబ్ కాంప్లెక్స్లో పూజలు చేసుకునేందుకు తనకు రాజ్యాంగం హక్కు కల్పించిందని వ్యాఖ్యానించారు.
''గత 800 ఏళ్లుగా ఆరాధన కార్యక్రమాలు లేకుండానే అక్కడ దేవుడు ఉంటున్నాడు కదా... వారిని అలాగే ఉండనివ్వండి'' అని జడ్జి అన్నారు. దీనిపై మరికొన్ని వారాల్లో తీర్పు వెలువడనుంది.
ఇవి కూడా చదవండి:
- పోస్టాఫీసులో ప్రజలు డిపాజిట్ చేసిన కోటి రూపాయలతో ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన సబ్ పోస్ట్ మాస్టర్
- ఫేస్బుక్: మెటావర్స్లో మహిళ అవతార్పై లైంగిక దాడి
- యాసిన్ మలిక్కు జీవితఖైదు విధించడంపై పాకిస్తాన్ ఎలా స్పందించింది
- భారతీయులు లావెక్కిపోతున్నారు... ఇది మామూలు సమస్య కాదు
- స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు నష్టాల నుంచి బయట పడేందుకు ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)