గుజరాత్లో దారుణం: మరుగుతున్న నూనెలో వాళ్లిద్దరి చేతులు పెట్టించిన భార్య..
అహ్మదాబాద్: గుజరాత్లోని రాజ్కోట్లో దారుణం జరిగింది. పక్కింటి అమ్మాయితో భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో.. వారిద్దరి చేతులను మరిగే నూనెలో పెట్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. సుమన్-రాహుల్ దంపతులు రాజ్కోట్లో నివసిస్తున్నారు. ఇద్దరి వయసు ముప్పైలలో ఉంటుంది. వీరి పొరుగింట్లో ఓ 17ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఇటీవల రాహుల్ ఆ బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సుమన్ కి అనుమానం వచ్చింది.
ఇదే విషయంపై అతన్ని నిలదీసిన భార్య.. రాహుల్ ను తన నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించింది. ఇందుకోసం మరిగే నూనెలో బాలికతో కలసి చేతులు పెట్టాల్సిందిగా చెప్పింది. దీంతో భార్య చెప్పినట్టే చేశాడు రాహుల్. మొదట బాలికతో బలవంతంగా నూనెలో చేతులు పెట్టించిన అతను.. ఆపై తనూ పెట్టాడు.
ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో స్థానిక ఆసుపత్రి తరలించారు. ఘటనపై మీడియాతో మాట్లాడిన బాధిత బాలిక.. గత కొంతకాలంగా రాహుల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పడం గమనార్హం. బాధిత బాలిక తల్లిదండ్రులు సుమన్-రాహుల్ లపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది.