నిర్భయ కేసు : చెప్పులతో కొట్టుకుంటూ.. కోర్టు ప్రాంగణంలో సొమ్మసిల్లిన అక్షయ్ భార్య
మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు నేపథ్యంలో నిర్భయ దోషులు ఆఖరి నిమిషం దాకా శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు పిటిషన్లతో ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్షను వాయిదా వేయించుకున్న దోషులు.. తాజా డెత్ వారెంట్ను కూడా వాయిదా వేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ న్యాయస్థానాలు ఈసారి వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ పటియాలా కోర్టు కొట్టివేసింది. దీంతో మార్చి 20,ఉదయం 5.30గంటలకు దోషులకు ఉరిశిక్ష పడనుంది. పటియాలా కోర్టులో దోషుల పిటిషన్లపై విచారణ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం,

కోర్టు ప్రాంగణంలో చెప్పులతో కొట్టుకుంటూ..
నిర్భయ దోషుల పిటిషన్ను పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేయడంతో.. దోషుల్లో ఒకరైన అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవి కోర్టు ఎదుట కూలబడి తీవ్రంగా రోధించింది. ఈ క్రమంలో తనను తాను చెప్పులతో కొట్టుకుంటూ ఏడవగా.. కాసేపటికి సొమ్మసిల్లి పడిపోయింది. మళ్లీ కాసేపటికే తేరుకుని.. 'నాకు బతకాలని లేదు.. ఉరిశిక్ష అమలైతే చనిపోతాను..' అంటూ వ్యాఖ్యానించింది. పునీతా దేవి రోధనలతో కోర్టు ప్రాంగణంలో కొద్దిసేపు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

పదేళ్ల క్రితం వివాహం..
అక్షయ్ ఠాకూర్-పునీతా దేవిలకు మే 29,2010న జార్ఖండ్లోని పాలము జిల్లాలో వివాహం జరిగింది. వీరికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పునీతా దేవీ రెండు రోజుల క్రితమే బీహార్లోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ కేసులో తన భర్త దోషి అని తేలినప్పటికీ.. అతను అమాయకుడు పిటిషన్లో పేర్కొన్నారు. అతనికి ఉరిశిక్ష అమలైతే.. తాను జీవితాంతం విధవరాలిగా బతకలేనని.. కాబట్టి శిక్ష అమలుకు ముందే తనకు విడాకులు ఇప్పించాలని పిటిషన్లో కోరారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై ఇంకా విచారణ జరపాల్సి ఉంది.

ఆఖరి నిమిషం దాకా అడ్డుకునేందుకు ప్రయత్నం
గురువారం(మార్చి 19)న ఢిల్లీ పటియాలా కోర్టులో విచారణ సందర్భంగా దోషుల తరుపు న్యాయవాది ఉరిశిక్షపై స్టే ఇచ్చేందుకు న్యాయమూర్తి ఎదుట అనేకే అంశాలను ప్రస్తావించారు. ఆఖరికి కరోనా వైరస్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అలాగే పవన్ గుప్తా రెండో క్షమాభిక్ష పిటిషన్,సుప్రీంలో అతని క్యురేటివ్ పిటిషన్ పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అక్షయ్ భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్ కూడా ఇంకా పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. వినయ్ శర్మ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడని.. అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ పిటిషన్ దాఖలైందని చెప్పారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని శిక్షను వాయిదా వేయాలని కోరారు. అయితే కోర్టు మాత్రం దోషుల తరుపు న్యాయవాదితో ఏకభీవించకుండా స్టే పిటిషన్ను కొట్టివేసింది.

రేపే ఉరిశిక్ష..
తాజా స్టే పిటిషన్ కొట్టివేత నేపథ్యంలో పటియాలా కోర్టు ఇదివరకు జారీ చేసిన డెత్ వారెంట్ అమలుకానుంది. దీని ప్రకారం మార్చి 20,ఉదయం 5.30గంటలకు నలుగురు దోషులు ముకేశ్ కుమార్,పవన్ గుప్తా,అక్షయ్ ఠాకూర్,వినయ్ శర్మలను ఉరితీయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష వాయిదాపడ్డ నేపథ్యంలో నాలుగో డెత్ వారెంట్పై అందరి దృష్టి నెలకొంది. ఇక ఈ కేసు విచారణ సమయంలోనే మరో దోషి రామ్ సింగ్ మార్చి 11,2013న తీహర్ జైలు బ్యారక్లోనే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరో దోషి మైనర్ కావడంతో మూడేళ్ల పాటు అతన్ని జువైనల్ హోమ్లో ఉంచి.. ఆపై విడుదల చేశారు.












Click it and Unblock the Notifications