లోకసభ: మోడీపై కేజ్రీవాల్, సోనియాపై షాజియా ఇల్మి?
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన ఎఎపి నేత షాజియా ఇల్మిలు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు ఈ పేర్లు పూర్తిగా ఖరారు కానప్పటికీ వీటిపై ఎఎపి చర్చిస్తోంది. ఇల్మి ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో ఆర్కె పురం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ లేదా ఫరూఖాబాద్ నుంచి సల్మాన్ ఖుర్షీద్ పైన పోటీకి ఆమె ఆసక్తి చూపించారు.
అయితే, సల్మాన్ ఖుర్షీద్ పైన మరో అభ్యర్థిని ఎఎపి బరిలోకి దింపింది. ఇప్పుడు ఇల్మిని సోనియా పైన పోటీ చేయించాలని భావిస్తోంది. ఢిల్లీలో తమకు గట్టి బలం ఉంది కాబట్టి ఎలాంటి అభ్యర్థి అయినా ఫర్వాలేదని, సోనియాలాంటి బలమైన ప్రత్యర్థి పైన పోటీకి కాస్త పేరున్న వ్యక్తులైతేనే బాగుంటుందని షాజియా పేరును పరిశీలిస్తున్నారు.
మోడీ గుజరాత్ బయట ఎక్కడి నుండి పోటీ చేసినా అక్కడ కేజ్రీవాల్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీ ఎక్కడి నుండి పోటీ చేస్తారో చెప్పాక ఎఎపి తమ అభిప్రాయం చెప్పనుంది. బిజెపి మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీకి సార్వత్రిక ఎన్నికల్లో ఢీకొంటానని ఎఎపి నేత అంజలి దమానియా చెబుతున్నారు.