చిన్న బ్రేక్ మాత్రమే.. సీజన్ మారాకా తిరిగి అధికారంలోకి వస్తాం: ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్
ముంబై: మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత మహారాష్ట్ర రాజకీయపరిణామాలు శరవేగంగా మారాయి. మధ్యాహ్న సమయం కల్లా బీజేపీ ఎంతో ఆశపెట్టుకున్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ కొన్ని ఒత్తిళ్లతో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడం ఆ వెంటనే ఫడ్నవీస్ సీఎంగా రాజీనామా చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేమహావికాస్ అగాడీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగిపోయింది. ఇక బుధవారం మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా "తిరిగి ప్రభుత్వంలోకి వస్తాం" అనే నినాదంతో ఫడ్నవీస్ ముందుకెళ్లారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు సమయంకల్లా రాజకీయపరిణామాలు తారుమారు అవడంతో ఆ పల్లవికి అర్థం లేకుండా పోయింది. శివసేన మద్దతు ఇచ్చి ఉండి ఉంటే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అయ్యేది. కానీ ఇద్దరి మధ్య సఖ్యత చెడటంతో బీజేపీకి కష్టతరంగా మారింది. అయితే మంగళవారం రోజున తన భర్త ఫడ్నవీస్ రాజీనామా చేశాక అమృత ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
पलट के आऊंगी शाखों पे खुशबुएँ लेकर,
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) November 26, 2019
खिज़ां की ज़द में हूँ मौसम ज़रा बदलने दे! Thanks Mah for memorable 5yrs as your वहिनी !The love showered by you will always make me nostalgic! I tried to perform my role to best of my abilities-with desire only to serve & make a positive diff🙏 pic.twitter.com/ePUzQgR9o5
స్వతహాగా బ్యాంకు ఉద్యోగస్తురాలైన అమృత ఫడ్నవీస్... సీజన్ మారగానే కొత్త సువాసనలతో తిరిగి ప్రభుత్వంలోకి వస్తామంటూ వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాటు అద్భుతమైన పరిపాలన అందించేందుకు దీవించిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు అమృతా ఫడ్నవీస్. ప్రజలు తన భర్తపై తన కుటుంబంపై చూపిన ప్రేమ ఎప్పటికీ మరవలేమనే ఎమోషనల్ ట్వీట్ చేశారు.
అంతేకాదు మహారాష్ట్ర ప్రజలు తనను వదినలా భావించి ప్రేమాభిమానాలు చూపినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటామని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి తన ఆలోచనలు కూడా జతచేసినట్లు చెప్పిన అమృతా ఫడ్నవీస్... ఉన్న ఐదేళ్లలో ప్రజాసేవకే తన భర్త అంకితమయ్యాడని చెప్పుకొచ్చారు. త్వరలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, సుస్థిరమైన ప్రభుత్వంతో సుపరిపాలన అందిస్తామని అమృతా ఫడ్నవీస్ చెప్పారు.