డిసెంబర్ 3 నాటికి కరోనా అంతమవుతుందా? ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక నిజమవుతుందా!!
ఇండియాలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారతదేశం యొక్క మొత్తం కేసుల సంఖ్య కేసుల సంఖ్య నేడు 28 లక్షలను అధిగమించింది. ఒక పక్క దేశంలో కేసులు రోజు రోజుకీ పెరుగుతుంటే ఇండియా అవుట్ బ్రేక్ నివేదిక డిసెంబర్ 3 నాటికి దేశంలో కరోనా వైరస్ అంతమవుతుంది అంటూ ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
డిసెంబర్ 3 నాటికి ఇండియాలో కరోనా వైరస్ తగ్గుముఖం
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో ఎంత పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతాయో,పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అన్న ఆందోళన కొనసాగుతుంది. వ్యాక్సిన్ వస్తేనే దీనికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అన్న భావన వ్యక్తమవుతోంది.ఈ సమయంలో డిసెంబర్ 3 నాటికి ఇండియాలో కరోనా వైరస్ వెనుతిరిగే దశలో ఉంటుందని ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఈ నివేదిక ప్రకారం సెప్టెంబర్ తొలి వారంలో కేసుల సంఖ్య గరిష్టంగా పెరుగుతుందని ఒక అంచనా.
సెప్టెంబర్ తొలి వారాల్లో గరిష్టంగా కేసులు .. ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక అంచనా
సెప్టెంబరు తొలి వారం నాటికి యాక్టివ్ గా ఉండే కేసుల సంఖ్య 7,80,000 వరకు ఉంటుందని ఆ తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టడం మొదలవుతుందని నివేదిక వెల్లడించింది.సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో కరోనా వైరస్ ప్రభావం అధిక స్థాయిలో ఉంటుందని, ఆ తర్వాత పదిహేను రోజులకు నిదానంగా కరోనాతగ్గుముఖం పట్టటం ప్రారంభమవుతుందని నివేదిక పేర్కొంది. కరోనా వ్యాప్తి చెందుతున్న దశలో మొదట్లో ఢిల్లీ,ముంబై వంటి నగరాల్లో కేసుల సంఖ్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్లు గా తెలుస్తుంది.
ప్రధాన నగరాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్న పరిస్థితి
ఢిల్లీ లో ఇప్పుడు 58 లక్షల మందిలో కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని వివిధ కథనాలు వెలువడుతున్న సమయంలో ఇండియా అవుట్ బ్రేక్ నివేదిక అంచనాలు భారతీయుల్లో ఆశను పెంచుతున్నాయి. కరోనా తగ్గే అవకాశం కనిపిస్తోంది అన్న భావనను కలిగిస్తున్నాయి. కరోనా హాట్ స్పాట్స్ నుంచి నిదానంగా తగ్గుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో అక్టోబర్ చివరి వారం నుండి వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నివేదిక వెల్లడిస్తోంది.
చిన్న చిన్న పట్టణాలు ,గ్రామాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న రిపోర్ట్
కరోనా వైరస్ ని ఎదుర్కొనే శక్తి భారతీయులలో పెరుగుతుందని, నవంబర్ కల్లా ముంబై నగరం కూడా కరోనా నుండి బయటపడుతుందని ఒక అంచనా. ఆగస్టు నెలాఖరుకు బెంగళూరులో కేసుల సంఖ్య గరిష్టానికి చేరుకుంటుందని, నవంబర్ రెండవ వారం తరువాత తగ్గుముఖం పడుతుందని నివేదిక స్పష్టం చేసింది. మహానగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ ఉండటం, చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వాటిపై దృష్టి సారించాలని నివేదిక వెల్లడించింది.
మహారాష్ట్రలోనూ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న నివేదిక
తాజా కేసులలో ఎక్కువ భాగం ఇండోర్, థానే, సూరత్, జైపూర్, నాసిక్ మరియు తిరువనంతపురం వంటి వాటిలో నమోదవుతోంది. ఈ నగరాల్లో కరోనా యొక్క ముగింపు నవంబర్ రెండవ వారంలో లేదా తరువాత మాత్రమే ఉంటుందని అంచనా. ఆగస్టు 15 నాటికి, దేశంలోనే అత్యంత కరోనా ప్రభావిత రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో తెలంగాణ మాదిరిగానే 1.24 వ్యాప్తి రేటు ఉందని ఇండియా కరోనా నుండి బయటపడే పరిస్థితి కనిపిస్తుందని అంచనా వేసింది.
ఇండియా ఔట్ బ్రేక్ నివేదికపై ఆశలు .. అంచనా నిజమవుతుందా?
దేశం లో ఈ రోజు 69,672 కరోనా కేసులతో కొత్త రోజువారీ రికార్డును నమోదు చేసింది. మొత్తం రికవరీలు ఇప్పుడు దాదాపు 21 లక్షలకు పెరిగాయి. రికవరీ రేటు సుమారు 74 శాతం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం 6,86,395 క్రియాశీల కేసులు ఉన్నాయి, 53,866 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు వివిధ ప్రధాన నగరాల్లో వైరస్ వ్యాప్తిని అధ్యయనం చేసిన ఇండియా ఔట్ బ్రేక్, డిసెంబర్ నాటికి కరోనా ఇండియాలో తగ్గు ముఖం పడుతుందని ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అది ఏ మేరకు సాధ్యం అవుతుందో వేచి చూడాలి .