చైనా స్వరాలకు నేపాల్ తోకజాడింపు.. భారత్పై విషం కక్కిన ప్రధాని ఓలి.. భూఆక్రమణకు శపథం..
వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు తగ్గేలా బలగాలను వెనక్కి తీసుకుంటోన్న చైనా.. ఇప్పుడు నేపాల్ సరిహద్దులో వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు రెడీ అయింది. డ్రాగన్ నాదస్వరానికి అనుగుణంగా నేపాల్ సైతం తోకతాడింపులకు పాల్పడుతున్నది. లిపులేఖ్, లింపియదుర, కాలాపానీ ప్రాంతాలను భారత్ ఆక్రమించిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి శపథం చేశారు.
Recommended Video

పార్లమెంట్ సాక్షిగా..
కొంతకాలంగా చైనాకు బాగా దగ్గరవుతోన్న నేపాల్.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ సరిహద్దులోని లిపులేఖ్, లింపియదుర, కాలాపానీ ప్రాంతాలు తనవేనంటూ క్లెయిమ్ చేసుకోవడం.. ఆ మేరకు కొత్త జాతీయ మ్యాప్ ను సైతం రూపొందించడం, ఆ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును సైతం ప్రవేశపెట్టడం తెలిసిందే. గురువారం నేపాల్ పార్లమెంటులో మాట్లాడిన ప్రధాని ఓలి.. ఆక్రమించిన భూభాగాన్ని భారత్ తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా..

నకిలీ సరిహద్దులు..
చరిత్ర పొడవునా నేపాల్ లో అంతర్భాగంగా ఉన్న కాలాపాని ప్రాంతాన్ని 1962 తర్వాత భారత్ ఆక్రమించిందని, కృత్రిమంగా కాళీ నదిని సృష్టించి, సైనిక బలగంతో ఈ దురాక్రమణకు పాల్పడిందని, ఇవాళ్టికీ అక్కడ భారీగా సాయుధుల్ని మోహరించిందని ఓలి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఆక్రమణలోని భూభాగాన్ని నేపాల్ ఎలాగైనాసరే తిరిగి కైవసం చేసుకుంటుందని, ఆ మేరకు దౌత్యపరమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఈ వివాదం సామరస్యంగా ముగిసిపోయేలా ఆ మూడు ప్రాంతాల నుంచి భారత సైన్యాలు తప్పుకోవాలని ఓలి వ్యాఖ్యానించారు.

ఇక సహించబోమంటూ..
నేపాల్ పట్ల భారత్ అన్యాయంగా వ్యవహరిస్తున్నదని, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడంలేదని, ఇకపై అన్యాయపూరిత చర్యలను సహించబోమని ప్రధాని ఓలి అన్నారు. ‘‘సరిహద్దుల వెంబడి నేపాల్ భూభాగంలో భారత్ డ్యామ్లు నిర్మిస్తోంది. ఈ చర్య రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. పొరుగుదేశంతో ఇలా వ్యవహరించడం సరికాదని చాలా సార్లు చెప్పి చూశాం. కానీ భారత్ వినిపించుకోవడంలేదు. ఆ మూడు ప్రాంతాలను స్వాధీనం చేసుకునే విషయంలో పార్టీలకు అతీతంగా నాయకులు, దేశం మొత్తం ఒకే మాటపై నిలబడింది''అని నేపాల్ ప్రధాని చెప్పుకొచ్చారు.

సీఎం యోగికి అవసరమా?
భారత్ తో సంబంధాల విషయంలో గతంలో టిబెట్ చేసిన తప్పిదాన్నే నేపాల్ పునరావృతం చేయరాదన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనపై నేపాల్ ప్రధాని ఓలి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అనవసరమని, ఒకవేళ ఆయనా మాటలు అనుకుంటే గనుక అది నేపాల్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించిట్లవుతుందని ఓలి అన్నారు. కాలాపాని ప్రాంతాన్ని తనదిగా పేర్కొంటూ నేపాల్ రూపొందించిన మ్యాపులకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications