మోడీ అసలు ప్రత్యర్ధి కాంగ్రెస్సా ? ఆమ్ ఆద్మీ పార్టీనా ? తేల్చబోతున్న గుజరాత్ పోరు !
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోరు తీవ్రంగా సాగుతోంది. గత 27 ఏళ్లుగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేకతను అధిగమించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ పోరులో బీజేపీ విజేతగా నిలిచినా, నిలవకపోయినా ఈ ఎన్నికలు 2024 ఎన్నికల్లో ప్రధాని మోడీ భవిష్యత్తును మార్గం నిర్దేశించబోతున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సుపరిపాలన, అభివృద్ధి మంత్రాల్నే జపిస్తోంది. గతంలో 2002లో గోద్రా అల్లర్ల తర్వాత మతతత్వ అజెండాతో కాంగ్రెస్ ను అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకున్న బీజేపీ.. ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ల నుంచి ఎదురవుతున్న పోటీతో తిరిగి సుపరిపాలన అజెండాకు వచ్చేసింది. దీంతో ఆమె ఆద్మీ వంటి అభివృద్ధి కేంద్రంగా రాజకీయాలు చేసే పార్టీ కూడా బీజేపీ వదిలేసిన మతపరమైన అజెండాలోని కొన్ని అంశాల్ని తీసుకుని జనంపై ప్రయోగిస్తోంది.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో, సీనియర్ నేతలు దూరం కావడంతో కుదైలేంది. అదే సమయంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కూడా గుజరాత్ ను టచ్ చేయకుండా దూరంగా వెళ్లిపోతోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సరేసరి. దీంతో గత ఎన్నికల్లో బీజేపీకి కాస్తో కూస్తో పోటీ ఇచ్చిన కాంగ్రెస్ స్ధానాన్ని ఆప్ ఆక్రమించబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
కానీ ఎన్నికల సర్వే సంస్ధలు మాత్రం కాంగ్రెస్ కు రెండో స్ధానాన్ని, ఆప్ కు మూడోస్ధానాన్ని మాత్రమే కట్టబెడుతున్నాయి. అయినా కాంగ్రెస్, ఆప్ మాత్రం ఈ సర్వేల్ని నమ్మడం లేదు. అయితే ఆప్,కాంగ్రెస్ ఇద్దరిలో రెండోస్ధానం కోసం పోటీ జరిగితే అందులో రెండోస్ధానంలో నిలిచే పార్టీ కచ్చితంగా జాతీయస్ధాయిలో ప్రధాని మోడీకి 2024 ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్ధిగా అవతరించే అవకాశం ఉంది.
దీనికి కారణం ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో ఆయన ఛరిష్మాతో పోటీ పడి గెలిచినా, రెండోస్ధానం సాధించినా అది కచ్చితంగా జాతీయస్దాయిలో ప్రభావం చూపడం ఖాయం. అందుకే ఇప్పుడు గుజరాత్ లో ఎన్నికల ఫలితాలు జాతీయ స్ధాయిలో 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా మారిపోతున్నాయి.