Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు తలనొప్పిగా ఇండియా కూటమి పార్టీలు ?
ఉత్తరాదిన హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కాంగ్రెస్ పార్టీ కల తీరేలా కనిపించడం లేదు. అధికార బీజేపీకి గట్టి ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలో తెలియక కమలనాథులు మథనపడుతుంటే అంత కష్టమెందుకు మేం ఉన్నాంగా అంటూ ఇండియా కూటమిలో పార్టీలో ముందుకొస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఇండియా కూటమి పార్టీలైన ఎస్పీ, ఆప్ నుంచి కాంగ్రెస్ ఎదుర్కొంటున్న పోటీయే ఇందుకు నిదర్శనం.
ఈసారి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఎస్పీ 33 సీట్లలో ఒంటరిగా పోటీకి దిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఎస్పీ పోటీకి దిగిన నియోజకవర్గాలన్నీ చంబల్, వింధ్య ప్రాంతాల్లోనే ఉన్నాయి. చంబల్లో 2018లో కాంగ్రెస్ గెలిచిన సబల్ఘర్, జౌరా, సుమావాలి, డిమ్ని వంటి స్థానాల్లో ఈసారి ఎస్పీ పోటీకి దిగింది. అలాగే వింధ్య, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో 2018లో బీజేపీ గెలిచిన స్థానాల్లో ఎస్పీ ఎక్కువగా పోటీ చేస్తోంది.

అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎన్నికల్లో 69 స్ధానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో కాంగ్రెస్ తో పాటు బీజేపీ అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ స్ధానిక సంస్ధల ఎన్నికల తర్వాత తమ బలం పెరిగిందని, అందుకే అసెంబ్లీకి కూడా పోటీ చేస్తున్నట్లు ఆప్ చెబుతోంది. తమ పోటీ వల్ల కాంగ్రెస్ తో పాటు బీజేపీ ఓట్లకు కూడా గండిపడే అవకాశం ఉందన్న అంశాన్ని ఆప్ ప్రస్తావిస్తోంది. దీంతో ఇండియా కూటమిలో మరో మిత్రపక్షం నుంచి కూడా కాంగ్రెస్ కు పోటీ తప్పడం లేదు.
ఇండియా కూటమి పక్షాల పరస్పర పోటీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నష్టం కలుగుతుందని అంచనా వేస్తుండగా.. బీజేపీ కూడా పలు చోట్ల నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను గంపగుత్తగా క్యాష్ చేసుకుందామన్న కాంగ్రెస్ ఆశలకు ఎస్పీ, ఆప్ రూపంలో ఎదురుదెబ్బ తగులుతోంది. అయితే ఆయాపక్షాలు మాత్రం తాము కోరిన సీట్లు కాంగ్రెస్ కేటాయించనందుకే బరిలో ఉన్నట్లు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications