ప్రియాంక గాంధీ భర్తను జైలుకు పంపిస్తా: ఉమా భారతి
ఝాన్సీ: తన చేతికి అధికారం వస్తే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తానని బిజెపి నేత ఉమా భారతి అన్నారు. ఎన్డీయె అధికారంలోకి వస్తే వాద్రాను జైలుకు పంపిస్తామని అని ఆమె అనడం ఇది రెండోసారి. నియమాలను అన్నింటినీ ఉల్లంఘించి వాద్రా సొమ్ము చేసుకున్నారని ఆమె ఆరోపించారు.
సోనియా గాంధీ అల్లుడు కావడంతో కాంగ్రెసు పాలిత రాష్ట్రాలన్ని రాబర్ట్ వాద్రాకు భయపడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. వాద్రా వల్ల కేంద్ర మంత్రులు కూడా ఒత్తిడికి గురవుతున్నారని ఆమె అన్నారు. ఆదివారం రాత్రి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తన పార్టీ తన పట్ల కొంత వ్యతిరేకత చూపవచ్చు గానీ తన చేతుల్లోకి అధికారం వస్తే వాద్రాను జైలుకు పంపిస్తానని ఆమె అన్నారు. వాద్రా చాలా తప్పులు చేశారని ఉమా భారతి గతవారం అన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తా రాబర్ట్ వాద్రా జైలుకు వెళ్తారని ఆమె అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తాము అధికారంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని, సానుకూల దృక్పథంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఎవరి పట్ల కూడా వేధింపు ధోరణితో వ్యవహరించదని, ఇతర వేధింపులకు తాను గత 12 ఏళ్లుగా బాధపడుతూ వస్తున్నానని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు.