రాజస్థాన్-మధ్యప్రదేశ్లలో ఇప్పుడు మీరే: అప్పుడే కాంగ్రెస్కు మాయావతి వార్నింగ్, అల్టిమేటం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఊహించని షాకిచ్చారు. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఇక్కడ బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగు రోజులకే ఆమె అధికార పార్టీకి అల్టిమేటం జారీ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి మాయావతి హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై పునరాలోచన చేస్తామని మాయావతి హెచ్చరిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా పలువురిపై కేసులు నమోదయ్యాయని, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో తాము మద్దతిచ్చిన కాంగ్రెస్ అధికారంలో ఉందని, కాబట్టి ఆ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. భారత్ బంద్ సమయంలో అమాయకుల పైన కేసులు పెట్టారన్నారు.
బీజేపీలో కాంగ్రెస్ వ్యవహరించవద్దు
లేదంటే తాము పొత్తుపై పునరాలోచన చేస్తామని మాయావతి తెలిపారు. అమాయకులపై కేసులు ఉంటే ఊరుకునేది లేదని చెప్పారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పారు. బీజేపీ గతంలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, ఆ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించవద్దని సూచించారు. లేదంటే పొత్తుపై మరో ఆలోచన చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అధికారంలో ఉన్నారు, ఉపసంహరించుకోవాలి
భారత్ బంద్ సమయంలో నాటి బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలలో రాజకీయపరంగా కేసులు నమోదు చేశారని మాయావతి ఆరోపించారు. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉందని తెలిపారు. కాబట్టి వెంటనే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక తప్పనిసరి
కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు తప్పనిసరి అని, ఆ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని మాయావతి చెప్పారు. హామీలను ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీలను ఒకే నాణేనికి రెండు వైపులుగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఈ మరకను తొలగించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందన్నారు. కాగా, 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్లో బీఎస్పీ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అదే రెండు సీట్లు తక్కువ పడటంతో మద్దతిచ్చింది. బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.