ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లీం మహిళలకు మంచిది అంటున్నా, కానీ రద్దు చేస్తాం: కాంగ్రెస్ మహిళా నేత
న్యూఢిల్లీ: తాము అధికారంలోకి రాగానే ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు సుష్మితా దేవ్ తెలిపారు. 'నేను హామీ ఇస్తున్నాను. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేం ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేస్తాం. ఇది నా ప్రామిస్' అని ఆమె చెప్పారు.
ఢిల్లీలో జరిగిన మైనార్టీ డిపార్టుమెంట్ నేషనల్ కన్వెన్షన్లో ఆమె మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళా సాధికారతకు ఉపయోగపడుతుందని చాలామంది తమతో చెప్పారని, కానీ ఇది ముస్లీం పురుషులపై బీజేపీకి ఆయుధమని, అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని, దీని వల్ల పోలీసుల వేధింపులు ఉండే అవకాశాలున్నాయని చెప్పారు.
ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లీం మహిళలకు నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకు వచ్చింది. ముస్లీం మహిళలకు న్యాయం జరిగేందుకు ఈ బిల్లును తీసుకు వచ్చిందని చెబుతున్నారు. ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. అయితే, రాజ్యసభలో ఈ బిల్లును పాస్ కానివ్వమని కాంగ్రెస్ చెబుతోంది.