గాంధీనగర్ గట్టు మీద అమిత్ షా నామినేషన్ : హాజరైన కమలదళ అగ్రనేతలు, కనిపించని అద్వానీ
అహ్మదాబాద్ : బీజేపీ అగ్రనేత అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తోన్న గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అంటే ఆయన వారసత్తాన్ని తీసుకోవడమేనన్నారు ఆ పార్టీ చీఫ్ అమిత్ షా. అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచి పోటీ చేసి ఆయన వారసత్వాన్ని నిలబెడుతానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషిచేస్తానని భరోసానిచ్చారు. శనివారం భార్య, కుమారుడు తోడురాగ, బీజేపీ అగ్రనేతల సమక్షంలో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు అమిత్ షా.
మోదీకి మళ్లీ పట్టం
సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీకి ప్రజలు తిరిగి పట్టం కడుతారని విశ్వాసం వ్యక్తం చేశారు అమిత్ షా. రెండోసారి ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టడం తథ్యమని చెప్పారు. గుజరాత్లో బీజేపీ బలంగా ఉందని .. 26 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తోందని తెలిపారు.
అట్టహాసంగా నామినేషన్
అమిత్ షా నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నామినేషన్ వేయడానికి ముందుగానే భారీ ర్యాలీ తీశారు. అంతకుముందు రోడ్ షోలో ప్రజలనుద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. 25 ఏళ్లు జననేతగా ఉన్నారని .. ఈసారి తనను గెలిపిస్తే ప్రత్యక్ష రాజకీయాల బరిలో ఉంటానని పేర్కొన్నారు. అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లి, మెజార్టీ సీట్లు సాధిస్తోందని చెప్పారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. మోదీ; షా ద్వయం నేతృత్వంలో దేశాభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలు
హాజరైన అతిరథ మహారథులు
రోడ్ షోలో కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, పీయూష్ గోయల్, రాం విలాస్ పాశ్వాన్, సుష్మ స్వరాజ్, గుజరాత్ సీఎం విజయ్ రుపానీ, ప్రకాశ్ సింగ్ బాదల్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, అమిత్ షా భార్య, కుమారుడు జయ్ షా పాల్గొన్నారు. అంతకుముందు సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా, నేతలు నివాళులర్పించారు.
ఆరుసార్లు పోటీ .. కనిపించని అద్వానీ
గాంధీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ ఆరుసార్లు పోటీచేశారు. ఆయనకు పెట్టిన కోట ఈ నియోజకవర్గం. కానీ ఈసారి బీజేపీ హైకమాండ్ .. 75 ఏళ్లు దాటినవారికి సీటు ఇవ్వొద్దని నిబంధన పెట్టి, అద్వానీని దూరం పెట్టింది. దీనికితోడు మోదీ, షా ద్వయం తీరుతో అసంతృప్తితో ఉన్న అద్వానీ పోటీకి సుముఖంగా లేరు. బీజేపీ కొత్త నిబంధనతో ఆయన బరిలో లేకపోవడం అనివార్యమైంది. దీంతో గాంధీనగర్ నుంచి షా బరిలోకి దిగారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి అగ్రనేతలంతా హాజరైన .. అద్వానీ మాత్రం కనిపించలేదు. దీంతో మోదీ, షా ద్వయం తీరుతో అద్వానీ గుర్రుమీద ఉన్నట్టు స్పష్టమవుతోంది.