'మాల్యాను భారత్కు తిరిగి రప్పిస్తాం': ఘాటు స్పందన
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా ఎంచక్కా లండన్ చెక్కేసిన కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్లో కీలక ప్రకటన చేసింది. విదేశానికి వెళ్లిన విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించి తీరతామని ప్రకటించింది.
విజయ్ మాల్యా వివాదంపై ప్రభుత్వం స్పందించాల్సిందిగా కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే, సీపీఎం నేత రాజేష్, ఆర్జేడీ ఎంపీ పప్పూ యాదవ్ లోక్సభలో నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లోక్సభలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఒక ప్రకటన చేశారు. అక్రమార్కుల్లో ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని నక్వీ కాస్తంత ఘాటుగానే స్పందించారు.

కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియానికి విజయ్ మాల్యా రూ.9 వేల కోట్లకు పైగా బకాయి పడ్డ సంగతి తెలిసిందే. భారత్లో తనకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ను లండన్కు చెందిన డియాజియోకు అమ్మేసి విదేశాలకు వెళ్తున్నానని ప్రకటించగానే ఎస్బీఐ సహా మిగతా బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అయితే అప్పటికే విజయ్ మాల్యా లండన్ వెళ్లిపోయారు. విజయ్ మాల్యా పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో మాల్యా ఈ నెల 2న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి మాల్యా తీసుకున్న రుణాల కన్నా ఎక్కువ ఆస్తులే ఆయనకు విదేశాల్లో ఉన్నాయని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. బ్యాంకుల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. రాజ్యసభకు చెందిన అతని అధికారి ఈయిల్ ఐడీ, లండన్లోని భారత హైకమిషన్, అతని న్యాయవాదుల ద్వారా ఈ నోటీసుల పంపనున్నారు.
విజయ్ మాల్యా పాస్పోర్ట్ను స్తంభింపజేయాలని, ఆయన స్వయంగా సుప్రీంకోర్టులో హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుని బ్యాంకులు అభ్యర్థించాయి. వాదనలు విన్న సుప్రీం కోర్టు దివాళాదారుడైన మాల్యాకు ఎందుకు రుణాలు ఇచ్చారంటూ సుప్రీంకోర్టు బ్యాంకులను ప్రశ్నించిది.












Click it and Unblock the Notifications