కుటుంబాలు లేనివాళ్లకు ఆ బాధలెలా తెలుస్తాయి?: బీజేపీ నేతలపై అఖిలేష్ యాదవ్ ఘాటు విమర్శలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న సమయంలో అధికార బీజేపీ, ప్రతిపఖ సమాజ్ వాదీ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ దోచుకునే కుటుంబ పార్టీ అంటూ బీజేపీ పార్టీ చేయడంపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
కేవలం కుటుంబం ఉన్నవారికే బాధలు తెలుస్తాయన్నారు అఖిలేష్ యాదవ్. కుటుంబం లేనివారు ప్రజల కష్టాలు ఎలా అర్థం చేసుకోగలుగుతారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లోని జూలౌన్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్బంగా అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు. బీజేపీ వాళ్లు తనను కుటుంబ పార్టీకి చెందినవాడిగా చెప్పుకుంటున్నారు.. కుటుంబం ఉన్న వ్యక్తి కుటుంబ బాధలను అర్థం చేసుకోగలడని అన్నారు.

బీజేపీ నాయకులకు ఎటువంటి కుటుంబం లేదు. అలాంటప్పుడు కుటుంబాల కష్టాలను వారు అర్థం చేసుకోగలరా? కేవలం కుటుంబం ఉన్న వ్యక్తి మాత్రమే బాధ్యతలను అర్థం చేసుకోగలడన్నారు అఖిలేష్ యాదవ్. ఇక్కడ కూర్చున్న వారిలో కుటుంబాలు కలిగిన వారికి ధరల పెరుగుదల బాధలు తెలుసు, ఉద్యోగాలు లేకపోవడం కలిగే బాధ యువతకు మాత్రమే తెలుసు అంటూ బీజేపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు.
ఇక సామాన్య ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును కొందరు వ్యాపారవేత్తలు దోచుకుని విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇదంతా జరుగుతోందన్నారు. మరోవైపు ఎస్పీపైనా బీజేపీ నేతలు అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎస్ అంటే సంపద దోచుకోవడం, పీ అంటే పరివార్ అంటూ అఖిలేష్ యాదవ్ కుటుంబంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కుటుంబ పార్టీ అంటూ సమాజ్ వాదీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎస్పీ చీఫ్ అఖిలేష్ కౌంటర్లు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునుండగా, ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 20న మూడో దశ పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలవడనున్నాయి.












Click it and Unblock the Notifications