కిరాణా షాపుల్లో "వైన్" అమ్మకాలు.. బీజేపీ సీరియస్ : రైతుల మేలు కోసమే అన్న శివసేన
మద్యం అమ్మకాలపై మహారాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. ఆదాయాన్ని పెంచుకోనేందుకు కొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి సూపర్ మార్కెట్లు, కిరాణ షాపుల్లో వైన్ అమ్మకాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షెల్ఫ్ ఇన్ షాప్ విధానానికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ మద్యం అమ్మే దుకాణాలు 1000 చదరపు అడుగులకు పైగా ఉండాలని షరతు విధించింది.

సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలలో వైన్
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలలో మద్యం అందుబాటులోకి రానుంది. అయితే ఈ మార్కెట్లలో కేవలం వైన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని మిగతా లిక్కర్ వంటి వాటికి అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఇది పదేళ్ల క్రితం నాటి ప్రతిపాదనని ప్రభుత్వం పేర్కొంది. దానికి ఇప్పుడు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. సూపర్ మార్కెట్లలో స్టాల్ ఏర్పాటు చేసి వైన్ విక్రయానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ సీరియస్..
సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో వైన్ అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ప్రభుత్వనిర్ణయాన్ని తప్పుపట్టింది. మహారాష్ట్రను మధ్యం రాష్ట్రంగా మారుస్తుందని ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడణవీస్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతికిస్తున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. రెండేళ్లుగా ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం మద్యం అమ్మకాలపై మహాకూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఫడణవీస్ విమర్శించారు.

వైన్ అంటే లిక్కర్ కాదు
ప్రతిపక్షాల విమర్శలపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. సూపర్ మార్కెట్లు, కిరాణ దుకాణాలలో వైన్ అమ్మకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. వైన్ అంటే లిక్కర్ కాదన్నారు. వైన్ అమ్మకాలు పెరిగితే రాష్ట్రంలోని రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. వైన్ అమ్మకాలు పెరిగితే.. ఉత్పత్తి కూడా పెరిగి దానికి అవసరమయ్యే పంటలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. తద్వారా రైతులకు మేలు జరుగుతుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు
రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంజయ్ రౌత్ తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. వాళ్లు ఎప్పుడైనా రైతుల గురించి పట్టించుకున్నారా..? అని నిలదీశారు. మద్యం అమ్మకాలపై వారికి మాట్లాడే అర్హత లేదన్నారు. హిమాచల్ ప్రదేశ్ , గోవా వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి విధానాలే ఉన్నాయని చెప్పుకోచ్చారు. బీజేపీ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications