భారత్లో 6లక్షల కరోనా పాజిటివ్ కేసులు... రష్యాని దాటేందుకు దగ్గరలో...
భారత్లో కరోనా వైరస్ కేసులు 6లక్షలు దాటాయి. బుధవారం(జూలై 1) నాటికి దేశంలో 6,00,32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రష్యా కంటే మనం కేవలం 50వేల కేసులు వెనకాల ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే... భారత్ రష్యాను దాటి మూడో స్థానానికి చేరేందుకు ఎక్కువ రోజులేమీ పట్టకపోవచ్చు. ఇక తొలి రెండు స్థానాల్లో 27,51,571 కేసులతో అమెరికా,14,26,913 కేసులతో బ్రెజిల్ ఉన్నాయి.
90శాతం కేసులు ఆ రాష్ట్రాల నుంచే...
బుధవారం ఉదయానికి భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,66,840గా ఉంది. కానీ సాయంత్రం వరకు మహారాష్ట్రలో 5537 కేసులు,తమిళనాడులో 3882 కేసులు,ఢిల్లీలో 2442 కేసులు,హైదరాబాద్లో 1018 కేసులు,ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6లక్షలు దాటింది. దేశంలో నమోదవుతున్న 90శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. ఇందులో మహారాష్ట్ర,తమిళనాడు,ఢిల్లీ,గుజరాత్,ఉత్తరప్రదేశ్,పశ్చిమబెంగాల్,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,హర్యానా,కర్ణాటక రాష్ట్రాలున్నాయి.
ఢిల్లీలో తగ్గిన కేసులు... : అరవింద్ కేజ్రీవాల్
బుధవారం (జూలై 1) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ... నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందన్నారు. జూన్ చివరి నాటికి రాష్ట్రంలో లక్ష పాజిటివ్ కేసులు నమోదవుతాయని,60వేల యాక్టివ్ కేసులు ఉంటాయని నిపుణులు అంచనా వేసినట్లు గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ఢిల్లీలో కేవలం 26వేల యాక్టివ్ కేసులే ఉన్నాయని... దీన్నిబట్టి వ్యాప్తికి కొంత అడ్డుకట్ట పడిందని పేర్కొన్నారు.
Recommended Video
ఈ ఒక్కరోజే అత్యధిక మరణాలు...
కోవిడ్ 19 మరణాల విషయానికొస్తే... బుధవారం ఒక్కరోజే భారత్లో 507 మంది పేషెంట్లు మృతి చెందారు. ఇప్పటివరకూ భారత్లో ఇదే అత్యధికం. తాజాగా సంభవించిన మరణాల్లో 70శాతం మరణాలు మహారాష్ట్ర,తమిళనాడు,ఢిల్లీల్లో నమోదైనవే. మహారాష్ట్రలో 245 మంది,ఢిల్లీలో 62 మంది,తమిళనాడులో 60 మంది,ఉత్తరప్రదేశ్లో 25 మంది,కర్ణాటకలో 20 మంది,గుజరాత్లో 19 మంది,పశ్చిమ బెంగాల్లో 15 మంది,మధ్యప్రదేశ్ రాజస్తాన్లలో 8 మంది చొప్పున,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లలో ఏడుగురు చొప్పున మరణించారు. తాజా డెత్ కేసులతో దేశంలో మొత్తం కోవిడ్ 19 మృతుల సంఖ్య 17848కి చేరింది. ఇక గత ఐదు రోజులుగా దేశంలో వరుసగా 18వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.