బిజెపిపై మిత్రుల భగ్గు: చంద్రబాబుతో గొంతు కలిపిన అకాలీదళ్
న్యూఢిల్లీ: బిజెపి తీరుపై మండిపడుతున్న మిత్రపక్షాల సంఖ్య పెరుగుతోంది. శివసేన, తెలుగుదేశం పార్టీలతో అకాలీదళ్ గొంతు కలిపింది. మిత్రపక్షాలను సరైన పద్ధతిలో చూడాల్సిన అవసరం ఉందని అకాలీదళ్ అభిప్రాయపడుతోంది.
Recommended Video
బిజెపి చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత తీసుకుని మిత్రపక్షాలను గౌరవించల్సిన అవసరం ఉందని అకాలీదళ్ సీనియర్ నేత నరేష్ గుజ్రాల్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తమ అన్యాయం జరిగిందనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభిప్రాయానికి ఆయన మద్దతు ప్రకటించారు.
సంకీర్ణ ధర్మం పాటించడం లేదు
బిజెపికి ఈసారి మద్దతు ఉండవచ్చు గానీ తాము సంకీర్ణంంలో భాగస్వాములమని, అపాయింట్మెంట్స్ విషయానికి వచ్చినప్పుడు చిన్న పార్టీలకు కూడా సంకీర్ణంలో కలుపుకుని వెళ్లాల్సి ఉంటుందని నరేష్ గుజ్రాల్ అన్నారు. మిత్రపక్షాల్లో ఏ పార్టీకి కూడా గవర్నర్ పదవి గానీ లెప్టనెంట్ గవర్నర్ పదవి గానీ ఇవ్వలేదని ఆయన అన్నారు.
చంద్రబాబుకు ఇచ్చిన హామీలు
చంద్రబాబుకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ విషయంంలో చాలా హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని నరేష్ గుజ్రాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. బడ్టెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే చంద్రబాబు అభిప్రాయాన్ని ఆయన బలపరిచారు.
మా సమస్యలు పరిష్కరించాల్సిందే..
శివసేన విషయానికి వస్తే మిత్రపక్షాలను ఇతర పార్టీలతో జత కట్టడం సంకీర్ణ ధర్మం కాదని నరేష్ గుజ్రాల్ అన్నారు. ఇవి అత్యంత ముఖ్యమైన సమస్యలని, వాటిని తాము పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం తప్ప పొత్తు నుంచి వైదొలుగుదామని కాదని ఆయన అన్నారు.
మోడీకి ఇలా చేయాల్సిన అవసరం ఉంది.
సాధారణ ఎన్నికలకు ముందు ఎనిమిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థితిలో తిరిగి అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీకి తగిన బలం కావాలంటే మిత్రపక్షాలతో కలిసి నడవాల్సిందేననే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యమైన అంశాల్లో కూడా మిత్రపక్షాలను సంప్రదించడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది.
చంద్రబాబుదీ అదే అభిప్రాయం..
బిజెపి తన మిత్రపక్షాలను దారుణంగా చూస్తోందని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో తాజాగా అభిప్రాయపడింది. పాత మిత్రులను శత్రువులుగా చూసే ధోరణి ప్రారంభమైందని, అది అత్యంత దారుణమైన విషయమని, ఈ ధోరణిని ఎత్తి చూపామని, ఇదే విషయాన్ని చంద్రబాబు బహిరంగంగా చెప్పారని శివసేన అభిప్రాయపడింది.
కచ్చితమైన ప్రకటన చేయాల్సిందే
బిజెపికి తాము చివరి అవకాశం ఇస్తున్నామని, తమకు న్యాయం చేయడానికి కచ్చితమైన ప్రకటనలు చేయాలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తమకు ఇచ్చేవాటిపై ప్రకటన చేాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రామ్ మోహన్ నాయుడు అన్నారు. తమ జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇప్పటికే పార్లమెంటు లోపల, వెలుపలా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అవేం సీరియస్ కాదంటున్న రేణుకా చౌదరి
బిజెపి మిత్రపక్షాలు పైకి అలా మాట్లాడుతున్నప్పటికీ తెగదెంపులు చేసుకోవని, బిజెపి మిత్రపక్షాలు సీరియస్గా లేవని కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు.