కార్మిక చట్టాలు ఖతమ్..? యాజమాన్యాలకు ఫుల్ ఫ్రీడమ్.. అసలేం జరుగుతోంది..
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. చాలావరకు పరిశ్రమలు నష్టపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కొన్ని కార్మిక చట్టాలను మూడేళ్ల పాటు రద్దు చేశాయి. పరిశ్రమలకు మేలు చేసేలా.. కార్మికుల వైపు నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చేసేందుకు ఈ సంస్కరణలు ఉపయోగపడనున్నాయి. కార్మికుల హక్కులను కాలరాయడమంటే.. వారి జీవితాలను మరింత అభద్రతలోకి నెట్టడమేనని మరోవైపు కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.

కార్మిక చట్టాల రద్దుతో ఏం జరుగుతుంది..
ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కార్మిక చట్టాలను తాత్కాలికంగా సడలించడం ద్వారా పారిశ్రామిక వర్గాలకు కార్మికుల ఎంపిక విషయంలో,తొలగింపు విషయంలో పూర్తి స్వేచ్చ లభించనుంది. అలాగే వేతనాలను నిర్ణయించడంలోనూ పరిశ్రమలకే పూర్తి స్వేచ్చ ఉంటుంది. ఉద్యోగ సంబంధిత బెనిఫిట్స్ను తగ్గించేందుకు కూడా పూర్తి సౌలభ్యం ఉంటుంది. అలాగే తనిఖీల నుంచి మినహాయింపులు ఉంటాయి. ఉద్యోగుల పనివేళలు 8గంటల నుంచి 12 గంటలకు పెంచుకునే అవకాశం ఉంటుంది.

అసలు సంఘటిత రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు..
దీర్ఘకాలంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, కొత్త ఉద్యోగాల కల్పనకు ఈ మార్పులు ఉపయోగపడుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయాలపై కార్మిక సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో 90శాతం అసంఘటిత కార్మికులు ఉన్న దేశంలో.. ఈ నిర్ణయం ఎంతమందికి వర్తిస్తుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం రిజిస్టర్డ్ కంపెనీలు,సంఘటిత రంగంలో పనిచేస్తున్న 10శాతం మంది ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

రద్దయిన చట్టాలివే..
కార్మిక చట్టాల్లోని కీలక నిబంధనలను బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మూడేళ్ల పాటు రద్దు చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యాపార,మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో మూడేళ్ల పాటు కొన్ని కార్మిక చట్టాలు వర్తించవు. వాటిల్లో భవన నిర్మాణ కార్మికుల చట్టం,కార్మిక పరిహారం చట్టం,బాండెడ్ లేబర్ సిస్టమ్ యాక్ట్,వేతన చెల్లింపు చట్టాలు ఉన్నాయి. కార్మికులకు నిర్ణీత గడువులోగా వేతనాలు చెల్లించడం,మెటర్నిటీ బెనిఫిట్స్ అందించడం వంటివన్నీ వేతన చెల్లింపు చట్టంలోనే ఉండటం గమనార్హం.

తొలగించడం.. తీసుకోవడం.. యాజమాన్యాల ఇష్టం..
ఈ చట్టాలను తొలగించడం ద్వారా కార్మికులు పలు హక్కులు కోల్పోతారు. కంపెనీల నిర్ణయాలకు కట్టుబడి ఉండటం తప్ప మరో గత్యంతరం ఉండదు. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాలు తొలగించడంతో కార్మికుల తొలగింపు,ఎంపిక విషయంలో పరిశ్రమలకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. ఇదివరకు కనీసం 30 రోజుల నుంచి 90 రోజుల నోటీస్ పీరియడ్తో ఉద్యోగులను తొలగించాల్సి ఉండేది. అలాగే ఒకేసారి 100 మంది కంటే ఎక్కువ మందిని తొలగించాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయ్యేది. కానీ ఇప్పుడవేవీ అవసరం లేదు.












Click it and Unblock the Notifications