ఇంద్రాని కేసులో ట్విస్ట్: ఆమె సోదరి కాదు కూతురు
ముంబై: షీనా బోరా హత్య కేసు దిగ్భ్రాంతికరమైన మలుపు తిరిగింది. టీవీ టైకూన్ పీటర్ ముఖార్జియా భార్య ఇంద్రాని ముఖార్జియా చేతిలో మరణించిన యువతి ఆమె సోదరి కాదు, కూతురని బుధవారం బయటపడింది. షీనా ఇంద్రానీ కూతురని షీనా సోదరుడు మైఖేల్ బోరా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
తన తల్లి తన సోదరిని చంపిందనే విషయంలో ఏ విధమైన సందేహం లేదని ఆయన అన్నారు. సిఎన్ఎన్ ఐబిఎన్తో ఆయన మాట్లాడారు. తాను షీనా గురించి అడిగినప్పుడల్లా ఆమె విదేశాల్లో ఉందని, మాట్లాడే సమయం కూడా ఆమెకు దొరకడం లేదని తల్లి ఇంద్రానీ చెబుతుండేదని ఆయన చెప్పారు.
ఇంద్రానీ భర్త పీటర్ ముఖార్జియా కూడా సిఎన్ఎన్ ఐబిఎన్తో మాట్లాడారు. షీనాకు తన కుమారుడితో అఫైర్ ఉందని, దాన్ని ఇంద్రానీ జీర్ణించుకోలేకపోయిందని ఆయన చెప్పారు. షీనా బోరా హత్య కేసులో పోలీసులు ఇంద్రానీ ముఖార్జియాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
2012లో షీనా బోరా హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇంద్రాని ముఖర్జియాతో పాటు వారి ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈనెల 31వ తేది వరకు ఇంద్రాని, డ్రైవర్ ను విచారణ చెయ్యడానికి పోలీసు అధికారులు కస్టడిలోకి తీసుకున్నారు.