ఎటిఎం కేంద్రంలో మహిళా బ్యాంక్ మేనేజర్పై దాడి
బెంగళూర్: పగటిపూట బెంగళూర్లోని ఓ ఎటిఎం కేంద్రంలో ఓ మహిళపై దారుణంగా దాడి జరిగింది. గార్డు లేని రద్దీగా ఉండే జెసి రోడ్డులోని ఎటిఎం కేంద్రంలో ఓ దుండగుడు మహిళా బ్యాంక్ మేనేజర్పై దాడి చేశాడు. ఈ దృశ్యాలు సిసిటివీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఎల్ఐసీ భవనంలో కల కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలో నగదు తీసుకోవడానికి కార్పొరేషన్ బ్యాంకుమేనేజర్ జ్యోతి ఉదయ్ (44)మంగళవారం ఉదయం ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు.
జ్యోతి లోపలికి ప్రవేశించిన కొద్ది క్షణాల్లోనే ఓ దుండగుడు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి షట్టర్ మూసేశాడు. అరిస్తే చంపేస్తానంటూ వెంట బ్యాగులో తెచ్చుకున్న కత్తి, రివాల్వర్తో ఆమెను బెదిరించాడు. మారణాయుధాలు చూసినా బెదరని జ్యోతి ఆగంతకుడిపై తిరగబడింది. తనపై తిరగబడ్డ జ్యోతిపై ఆగంతకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో జ్యోతి స్పృహకోల్పోయింది.

స్పృహకోల్పోయిన జ్యోతి ఒక పక్కకి ఒరిగిపోయింది. నిందితుడు తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. బెంగళూరు నగరంలో మంగళవారం పట్టపగలు జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. గాయపడిన జ్యోతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఏటీఎం కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఫొటో సహయంతో అతడిని అరెస్టు చేయాలని పోలీసులు యత్నిస్తున్నారు.
దుండగుడు వెళ్లిపోయిన తర్వాత రక్తమోడుతూ రాజరాజేశ్వరి నగర్కు చెందిన మహిళ మూడు గంటలపాటు స్పృహ కోల్పోయి ఎటిఎం కేంద్రంలోనే ఉండిపోయింది. ఎటిఎం కేంద్రం షట్టర్ కింది నుంచి రక్తం వస్తుండడం గమనించిన స్కూలు పిల్లలు ట్రాఫిక్ పోలీసులకు, దారిన పోయేవారికి చెప్పారు.
కపాళానికి దెబ్బ తగలడంతో జ్యోతి కుడిపక్క శరీరం పడిపోయిందని వైద్యులు చెప్పారు. దాడి చేసిన వ్యక్తి వద్ద ఉంది నకిలీ గన్ కావచ్చునని, కన్నడంలో మాట్లాడాడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications