కోడలిని మూడేళ్లు ఇరుకైన బాత్రూంలోనే బంధించారు
పాట్నా: అత్తవారు అడిగిన అదనపు కట్నం తీసుకు రాలేకపోవడం వల్ల ఓ మహిళను అత్తింటి వారు మూడేళ్లుగా స్నానపు గదిలోనే బంధించి ఉంచిన దారుణ సంఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఏకంగా మూడేళ్ల పాటు ఆమె ఇరుకైన స్నానపు గదిలోనే ఉండిపోయింది.
పుట్టింటి వారి ఫిర్యాదు, పోలీసుల జోక్యంతో ఆమె బయటకు వచ్చింది. మూడేళ్ల పాటు స్నానపు గదిలోనే ఉండటంతో ఆమె తన కన్న తల్లినే గుర్తు పట్టలేకపోయింది. కన్న తల్లినే ఎవరని ఆమె బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నించింది.
బీహార్లోని దర్భంగాలో ఇది జరిగింది. ప్రభాత్ కుమార్ సింగ్తో 2010లో బాధితురాలికి వివాహం అయింది. అదనపు కట్నం కోసం అత్తవారు ఆమెను వేధిస్తూ వచ్చారు. ఆడపిల్లకు జన్మను ఇవవడంతో మరింత బాధలు పెరిగాయి. తల్లిదండ్రులను గానీ, బంధువులను గాని కలవనీయలేదు.
ఆమెను ఇంటిలోని స్నానపు గదిలోనే అత్తవారు నిర్బంధించారు. తనకు పుట్టిన పాపను కూడా చూడనిచ్చే వారు కాదు. మిగిలి పోయిన అన్నం పెట్టేవారు. అనేక ప్రయత్నాలు చేసిన ఆమె తండ్రి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసులు ఆ ఇంటిని సోదా చేసినప్పుడు బాధితురాలి దుస్థితి బయటపడింది. తన మూడేళ్ల కూతురు గురించి ఆమె ప్రశ్నించింది. ఆ మూడేళ్ల కూతురు ఆమెను గుర్తు పట్టలేదు.