అపైర్: జంటను నగ్నంగా ఊరేగించి చెట్టుకు కట్టేశారు
జైపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో గల ఓ గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను విడిచి ఓ మహిళ తాను ఇష్టపడినవాడితో కలిసి జీవించేందుకు ఇంటినుంచి బయటకు వచ్చేసింది.
ఈ సంఘటన జూన్ 17వ తేదీన జరిగింది. మూడు రోజుల అనంతరం ఆమె భర్త కుటుంబ సభ్యులు, మరికొంతమంది గ్రామస్తులతో కలిసి వచ్చి ఇద్దరిని తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఊర్లో ఇద్దరిని నగ్నంగా ఊరేగించారు. ఆపై వీరంతా మహిళను ఆమె ప్రియుడిని ఇరువురిని కలిపి బహిరంగంగా రెండు రోజులపాటు చెట్టుకు కట్టేశారు.
ఈ మొత్తం సంఘటన ప్రభుత్వ కార్యాలయానికి, పాఠశాలకు సమీపంలోనే చోటుచేసుకుంది. ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు చూసి కూడా ఏ ఒక్కరూ స్పందించి అధికారులకు ఫిర్యాదు చేయలేదు. దారుణాన్ని చూసిన వాళ్లంతా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారే తప్ప ఏ ఒక్కరూ స్పందించలేదు.

ప్రియుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులకు నష్టపరిహారంగా అన్నట్లు రూ. 80 వేలను చెల్లించి అతన్ని విడిపించుకుపోయారు. మొత్తంమీద విషయం పోలీసులకు చేరడంతో బాధిత మహిళను పోలీసులు నిన్న రక్షించి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు.
ఈ కేసులో 30 మందిపై కేసులు నమోదు అయ్యాయి. బాధిత మహిళ భర్తతో పాటు మరో ముగ్గురి మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా యంత్రాంగం గ్రామ పట్వారీని విధులనుంచి బహిష్కరించింది. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఉపాధ్యాయులకు, ఆరోగ్య కార్యకర్తలకు అదేవిధంగా ఇతర ప్రత్యక్ష సాక్షులకు నోటీసులు పంపించింది. ఉదయ్పూర్ ఎస్పీ రాజేంద్ర గోయల్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications