లాయర్ లైంగిక వేధింపులు: లేడీ మెజిస్ట్రేట్ కేసు
న్యూఢిల్లీ: ఓ న్యాయవాది తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళా న్యాయమూర్తి కేసు పెట్టారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. న్యాయమూర్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు లాయర్ను అరెస్ట్ చేయలేదు.
గత నెల 30వ తేదీన ఈ ఘటన జరగగా 31న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసులో తన క్లైంట్ తరపున కోర్టులో వాదిస్తున్నసమయంలో లాయర్ తనపై అవమానకర వ్యాఖ్యలు చేశారని మేజిస్ట్రేట్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కోర్టు వాయిదా అనంతరం ఆవరణలో కలిసిన తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె అన్నారు.

ఈ ఘటనపై తూర్పు ఢిల్లీలోని ఫర్ష్ బజార్ పోలీసులకు మేజిస్ట్రేట్ ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద న్యాయవాదిపై కేసులు నమోదు చేశారు. అయితే మేజిస్ట్రేట్ తనపై తప్పుడు కేసులు బనాయించారని న్యాయవాది అంటున్నారు. ఆ రోజు కోర్టు తన క్లైంట్కు జరిమానా విధించిందని, దానిని చెల్లించేందుకు తన క్లైంట్కు 30 నిమిషాల సమయం కావాలని అడిగామని తెలిపారు.
దీనికి అంగీకరించిన మేజిస్ట్రేట్ అరగంట తర్వాత డబ్బులతో వచ్చిన తన క్లైంట్ను అడ్డుకుని జరిమానా రేపు కట్టాలని సూచించారని, దీనిని తాను వ్యతిరేకించడంతో తనపై అక్కసు పెంచుకున్నారని ఆయన అన్నారు. చట్టప్రకారం నిబంధనలు పాటించాలని ఆమెతో చెప్పడంతో కొంత వాగ్వాదం జరిగిందన్నారు. దీంతో ఆగ్రహం పట్టలేని ఆమె తనతో, తన క్లైంట్తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కోర్టు నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారని చెప్పారు.
మేజిస్ట్రేట్ తీరుపై అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కేసు పెట్టినట్టు తెలిపారు. కేసు పెట్టిన విషయాన్ని తెలుసుకున్న ఆమె మరుసటి రోజు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications