ఐఎఫ్ఎస్ అధికారిగా చెలామణి! ఫేక్ ఐడీలతో బురిడీ కొట్టించిన కిలేడీ!
ఢిల్లీ : ఆమె ఓ సాధారణ గృహిణి. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో పీజీ చేసింది. సివిల్ సర్వెంట్ కావాలని, వీఐపీలా బతకాలన్నది ఆమె కల. 2007లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. మంచి మార్కులు రాకపోవడంతో ఉద్యోగం రాలేదు. అయినా వీఐపీలా బతకాలన్న ఆశ చావలేదు. దీంతో తన కలను నిజం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కింది. టెక్నాలజీని ఉపయోగించి చావు తెలివితేటలతో 18నెలల పాటు వీఐపీ లైఫ్ ఎంజాయ్ చేసింది. చివరకు పాపం పండింది. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతోంది.

ఐఎఫ్ఎస్ అధికారిగా చెలామణి
మీరట్కు చెందిన జోయా ఖాన్ తండ్రి డాక్టర్. పీజీ చేసిన ఆమె సివిల్ సర్వెంట్గా ఎంపికైతే వీఐపీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని భావించింది. అయితే ఆమె ఆశ నెరవేరకపోవడంతో ఆరేళ్ల క్రితం కాన్పూర్కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకైన హర్ష్ ప్రతాప్ను కోర్టు మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి పక్కా స్కెచ్ వేసి ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అవతారం ఎత్తింది. ఫేక్ ఐడీ తయారుచేసి ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించింది.

పోలీస్ ఎస్కార్ట్స్ కోసం ఫోన్లు
ఫేక్ ఐడీతో ఐఎఫ్ఎస్ అధికారిగా చెలామణి అవుతున్న జోయాఖాన్ దాన్ని ఉపయోగించి పోలీసులను ఎస్కార్ట్ లుగా నియమించుకుంది. అలా నోయిడా, గురుగ్రామ్, మీరట్, ఘజియాబాద్, మొరాదాబాద్లలో తన హవా చెలాయించింది. ఐఎఫ్ఎస్ అధికారి అని చెప్పుకోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఆమెకు సెల్యూట్ కొట్టేవారు.

ఎస్ఎస్పీ అనుమానించడంతో బయటపడ్డ బండారం
గత నెల 23న జోయా నోయిడాలోని గౌతమ్ బుద్ధా నగర్ ఎస్ఎస్పీ వైభవ్ కృష్ణకు ఫోన్ చేసింది. పోలీస్ ఎస్కార్ట్ పంపడంతో ఆలస్యమెందుకు అవుతోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. జోయా తీరుపై అనుమానంతో ఎస్ఎస్పీ తీగ లాగితే డొంక కదిలింది. అమ్మగారి బండారం బయపడింది. భర్తతో పాటు జోయాను అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

ఫేక్ ఐడీ కార్డులు
పోలీసుల విచారణలో జోయాఖాన్కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఇంట్లో పలు ఫేక్ ఐడీ కార్డులు లభ్యమయ్యాయి. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ న్యూక్లియర్ ఆఫీసర్, యూఎస్ డిప్లొమాట్ ఇన్ ఆఫ్ఘనిస్థాన్ పేరుతో ఉన్న రెండు ఐడీ కార్డులు చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్న మహీంద్రా ఎస్యూవీతో పాటు హర్యానా నెంబర్ ప్లేట్ ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారు, ల్యాప్టాప్స్, నాలుగు సెల్ఫోన్లు, వాకీటాకీలు, ఫేక్ పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మొబైల్ యాప్తో మోసం
పోలీసుల దర్యాప్తులో జోయా ఖాన్కు సంబంధించి దిమ్మదిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాయిస్ కన్వర్టర్ మొబైల్ యాప్ ఉపయోగించి మగ గొంతుతో జోయా పీఏనని పోలీసులను పరిచయం చేసుకునేదని, [email protected] ఐడీతో మెయిల్స్ పంపేదని అధికారులు గుర్తించారు. జోయా ల్యాప్టాప్లో పలువురు రాజకీయ నాయకుల ఫొటోలు కనిపించడంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు. దర్యాప్తులో సైబర్ ఎక్స్పర్ట్స్ సాయం తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications