అంగట్లో అమ్మకానికి మహిళ.....వాడు అందుకోసమే కొన్నాడు, ఆమె పరిస్థితి ఇలా..!
ఉత్తర్ ప్రదేశ్ : నేరాలకు కేరాఫ్ అడ్రస్గా ఉత్తర్ప్రదేశ్ మారుతోంది. రోజూ ఏదో ఒక నేర వార్తతో యూపీ ప్రధానాంశాల్లో నిలుస్తోంది. తాజాగా ఓ మహిళని ఒక వ్యక్తి 10వేలకు అమ్మాడు. మహిళని కొన్న వారు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిర్లక్ష్యం చేయడంతో మహిళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
అప్పులు తీర్చలేక మహిళను అమ్మేసిన కిరాతకుడు
ఉత్తర్ప్రదేశ్లోని హపూర్లో నివసించే ఓ వ్యక్తి తాను చేసిన అప్పులు తీర్చలేక అతని ఇంట్లో ఉండే యువతిని అమ్మకానికి పెట్టాడు. మహిళని ఇతర వ్యక్తులు రూ.10వేలకు కొన్నారు. ఆమెతో నానా చాకిరీ చేయించుకుని ఆమెపై అత్యాచారం కూడా చేశారు. ఘటనపై ఆమె హపూర్ ఎస్పీని ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. అయితే తన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే పోలీసులు తనతో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న మనస్తాపంతో తనకు తాను నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది.
ఫిర్యాదు స్వీకరించని పోలీసులు
విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ బాధితురాలికి అండగా నిలిచింది. న్యాయం చేయమని పోలీసు స్టేషన్కు వెళితే పోలీసులు కనీసం పట్టించుకోలేదని వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్కు లేఖ రాశారు. పోలీసులు అవమానకరంగా మాట్లాడటంతోనే ఈ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని లేఖలో స్వాతి పేర్కొన్నారు. అంతేకాదు బాధిత మహిళకు పరిహారం చెల్లించాల్సిందిగా యోగీ ఆదిత్యనాథ్ను లేఖ ద్వారా కోరారు. ప్రస్తుతం మహిళ ఘజియాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మహిళది ఆత్మహత్యాయత్నమా లేక హత్యాయత్నమా..?
ఢిల్లీ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవడంతో పోలీసులు బాబుగఢ్ సర్పంచ్తో సహా మరో 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ప్రాథమిక విచారణలో కొన్ని అనుమానాలు వ్యక్తం అవడంతో వారిని ఇంకా అరెస్టు చేయలేదు.అయితే ఆమెనే నిప్పు పెట్టుకుందా లేక మరెవరైనా ఆ మహిళకు నిప్పు అంటించారా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని హపూర్ ఎస్పీ యశ్వీర్ సింగ్ తెలిపారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతోనే మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్న దాంట్లో నిజం లేదని అన్నారు. అంతేకాదు ఆమెకు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న చరిత్ర ఉందని, రెండు పెళ్లిళ్లు కూడా రద్దయినట్లు ఎస్పీ తెలిపారు. అయితే ఆమెపై అత్యాచారం జరిగింది ఐదేళ్ల క్రితమని, వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయని ఎస్పీ స్పష్టం చేశారు.