మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకే... మహిళా మున్సిపల్ వర్కర్పై దాడి... రోడ్డుపై రచ్చ రచ్చ చేసిన మహిళ...
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్డౌన్ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే సమయంలో మాస్కులు,భౌతిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తల గురించి పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అయినప్పటికీ కొంతమందిలో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. పైగా జాగ్రత్తలు చెప్పేవారి పైనే దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ముంబైలో ఓ మహిళ.. మహిళా మున్సిపల్ వర్కర్పై దాడికి పాల్పడింది. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు రోడ్డుపై రచ్చ రచ్చ చేసింది. చొక్కా పట్టుకుని లాగుతూ... ఆమెను చెంప దెబ్బలు కొట్టింది.

అసలేం జరిగింది...
ముంబైలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తగ్గినట్లే తగ్గిన వైరస్.. మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం(మార్చి 19) బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ)కి చెందిన ఓ మహిళా వర్కర్.. రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటోను ఆపింది. అందులో ఉన్న మహిళా ప్రయాణికురాలిని మాస్కు పెట్టుకోవాల్సిందిగా కోరింది. అంతే... అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు ఆ మహిళా తీవ్ర ఆగ్రహావేశంతో మున్సిపల్ వర్కర్పై దాడికి పాల్పడింది.

అసలేం జరిగిందనన్నే ఆపుతావా అంటూ దాడి...
మున్సిపల్ వర్కర్ను కాళ్లతో తన్నుతూ... చొక్కా పట్టుకుని.. తల వెంట్రుకలు లాగుతూ చెంపదెబ్బలు కొట్టింది. 'నన్నే ఆపుతావా... అసలు నన్ను తాకేందుకు నీకెంత ధైర్యం...' అంటూ ఆమెపై దాడికి పాల్పడింది. మధ్యలో ఒకరిద్దరు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మహిళ శాంతించలేదు. నిబంధనలు ఉల్లంఘించింది కాక... మాస్క్ పెట్టుకోమని కోరినందుకే ఇలా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర ప్రజల అలసత్వం,నిర్లక్ష్యం కారణంగానే కరోనా వ్యాప్తి చెందుతోందని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా ఇలాంటి వ్యక్తులకు అవేమీ పట్టకపోవడం గమనార్హం.

లాక్ డౌన్ యోచనలో ప్రభుత్వం...
సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరిగే వ్యక్తులకు రూ.200 బీఎంసీ జరిమానా విధిస్తోంది. అయితే ఇలా మున్సిపల్ వర్కర్పై దాడికి పాల్పడిన ఈ మహిళ పట్ల బీఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక కేసుల విషయానికి వస్తే గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 25,883 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. అటు ముంబైలోనూ వేలల్లోనే కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది నెలలుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన ధారావిలో కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధించే యోచనలో ఉంది.












Click it and Unblock the Notifications