మూడేళ్ల కిందటే ప్రేమ వివాహం: అంతలోనే అనుమానాస్పద మరణం
హాసన: కర్ణాటకలోని హాసనలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల కిందటే ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఓ గృహిణి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నయి. అదనపు కట్నం కోసం అత్తామామలే తమ కుమార్తెను హత్య చేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి పేరు అశ్విని. హాసనలోని శంకరిపురలో భర్త ఆదిత్య, అత్తామామలతో కలిసి నివసిస్తున్నారు.
ఆదివారం సాయంత్రం ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు చెలరేగినట్లు చుట్టుపక్కలవారు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అశ్వినిని ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. విషం సేవించడం వల్లే అశ్విని మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఊపిరితీసిన ప్రేమ : యువతి కోసం ఆందోళన, మరునాడే మృతి
బెంగళూరుకు చెందిన అశ్విని వివాహానికి ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేసే వారు. ఈ క్రమంలో ఆమెకు ఆదిత్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఆదిత్య తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలుస్తోంది. ఆదిత్య బలవంతం మీద వారితో కలిసి నివసించడానికి అంగీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పెళ్లి తరువాత అశ్విని ఉద్యోగాన్ని వదిలేశారు.
భర్తతో కలిసి హాసనలో నివసిస్తున్నారు. కొంతకాలంగా ఆదిత్య తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధిస్తున్నారని అశ్విని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదిత్య, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా- పోస్ట్మార్టమ్ నివేదిక తరువాత అసలు విషయం తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.