పోలీసుల దాష్టీకం: మహిళను జీపుపై కట్టేసి తిప్పారు, వేగానికి కిందపడటంతో తీవ్రగాయాలు
అమృత్సర్: పంజాబ్ పోలీసులు మరోసారి దాష్టీకానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయబోతే అతని భార్య అడ్డుపడిందంటూ.. ఆమెను తమ జీపుపై కట్టేసి ఊరంతా ఊరేగించారు. ఇలా ఊరేగిస్తున్న సమయంలో ఆ మహిళ ప్రమాదవశాత్తు జీపు పైనుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. ఓ ఆస్తి వివాదం కేసులో బాధిత మహిళ మామను విచారించడానికి చావిందా దేవి ప్రాంతంలోని వాళ్ల ఇంటికి వెళ్లారు పోలీసులు. అతను ఇంట్లో లేకపోవడంతో సదరు మహిళ భర్తను తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆమె అడ్డుకుంది.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన పంజాబ్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి జీపు టాప్పై కట్టేసి ఊరంతా తిప్పారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
గ్రేట్ ఎస్కేప్: బాలుడిపైనుంచి కారు పోనిచ్చిన యువతి(వీడియో)
కాగా, జీపుపై కట్టేసి ఊరంతా తిప్పుతున్న సమయంలో జీపు వేగానికి సదరు మహిళ కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇంత జరిగినా ఆ పోలీసులపై చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పాలన అంటూ అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో కూడా పంజాబ్ పోలీసులు ఓ మహిళను నడిరోడ్డుపై లాఠీలతో చితకబదాడం విమర్శలకు తావిచ్చింది.