మహిళ అంగీకారంతో సెక్స్ అత్యాచారం కాదు: కోర్టు
ముంబై: మహిళ అంగీకారంతో పురుషుడు జరిపే శృంగారాన్ని అత్యాచారం అనడానికి వీల్లేదని ముంబై సెషన్స్ కోర్టు తేల్చి చెప్పింది. కలిసి ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొని ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడంటూ అభియోగాలు మోపడం సరైంది కాదని అభిప్రాయపడింది. ఇటువంటి ఓ కేసులో కోర్టు పురుషుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఓ 36 ఏళ్ల మహిళ పరిపక్వత గల వయస్సును, ఆమె వివాహస్థితిని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆ అభిప్రాయాన్ని వెల్లడించింది.
సహజంగానే, ఓ వివాహిత పరిపక్వమైన వయస్సులో ఉండి, తన అంగీకారంతో నిందితుడితో పలుమార్లు లైంగిక సంబంధాలు పెట్టుకోవడం అత్యాచారం అభియోగాల కిందికి రాదని అదనపు సెషన్స్ న్యాయమరూ్తి షాయిదా రజ్వీ తన ఆరు పేజీల తీర్పులో స్పష్టం చేశారు. విచిత్రంగా, కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆ మహిళ సరిగా అవగాహన చేసుకోలేకపోవడం వల్ల కేసు పెట్టానని, నిందితుడిపై కేసును కొనసాగించడం తనకు ఇష్టం లేదని ఆ మహిళ చెప్పింది. కేసును పరిశీలిస్తే కూడా నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టడమే సరైందని రజ్వీ అన్నారు.
కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి - 2013 మార్చి 30వ తేదీన నిందితుడిపై గోరేగావ్లో కేసు నమోదైంది. తమ పొరుగునే ఉంటున్నందున నిందితుడు తనకు బాగా తెలుసుకునని, ఏడేళ్ల పాటు తాము రహస్యంగా కలుసుకుంటూ వచ్చామని ఫిర్యాదుదారు చెప్పింది. తాను వివాహం చేసుకున్నానని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిద్దరు కూడా వయోజనులని, గొడవ పడి తాను 2012లో తన భర్తతో విడిపోయానని ఆమె చెప్పింది. తన కూతురు తనతో ఉంటుండగా కుమారుడు తన మాజీ భర్తతో ఉంటున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది.
2011 నవంబర్ 9వ తేదీన నిందితుడు అతని ఇంటికి తనను పిలిచాడని, తనను పెళ్లి చేసుకోవాలని అడిగాడని, లైంగిక సబంధం పెట్టుకోవాలని కూడా అడిగాడని, అయితే తాను ఇష్టపడలేదని, తాను వెళ్లిపోతుండగా అతను తలుపులు మూసేసి తనపై బలాత్కారం చేశాడని, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇ్చచాడని, ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని, బయటకు వెల్లడిస్తే తన పరువు పోతుందని చెప్పాడని ఆమె వివరించింది.
కొద్ది రోజుల తర్వాత తనను లాడ్జికి తీసుకుని వెళ్లి తన మెడలో మంగళసూత్రం కట్టాడని, బొట్టు పెట్టి తమ వివాహం జరిగిందని చెప్పాడని, వివాహాన్ని నమోదు చేస్తానని కూడా హామీ ఇచ్చాడని, అప్పటి నుంచి 2013 ఫిబ్రవరి వరకు లాడ్జీల్లో, గెస్ట్ హౌస్ల్లో తాము పలుమార్లు శృంగారంలో పాల్గొన్నామని ఆమె చెప్పింది.
2013 ఫిబ్రవరి 13వ తేదీన నిందితుడు తనను అద్దెకు తీసుకున్న ఓ ఫ్లాట్కు తీసుకుని వెళ్లి అది తమ ఇళ్లు అని, తామిద్దరం భార్యాభర్తలమని చెప్పాడని, కలిసి జీవిస్తున్నప్పటికీ నిందితుడు లాంఛనంగా పెళ్లి చేసుకోలేదని, తనకు తప్పుడు వాగ్దానాలు చేస్తూ వచ్చాడని, దాంతో తాను ఫిర్యాదు చేశానని ఆమె వివరించింది.
దాంతో నిందితుడిపై అత్యాచారం, మోసం కింద కేసులు నమోదయ్యాయి. అయితే, కోర్టులో ఆమె తన మాట మార్చింది. 2011 నవంబర్ 4వ తేదీన తాను ఇష్టంగానే అతని ఇంటికి వెళ్లి శృంగారంలో పాల్గొన్నానని చెప్పింది. శృంగారంలో పాల్గొనడానికి అతను తప్పుడు హామీలు ఇవ్వలేదని చెప్పింది.