ఢిల్లీ సరిహద్దుల్లో ఉధృతంగా సాగిన మహిళా రైతుల ఆందోళన .. హైవేల మూసివేత,దారి మళ్లింపులు
దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతు ఉద్యమం మరోమారు ఉధృతంగా కొనసాగుతోంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన మహిళా రైతులు మహిళా దినోత్సవం నాడు గళమెత్తారు. నూతన వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీ కి వెళ్ళే మార్గాలు మూసివేత
తిక్రీ , ఘాజీపూర్ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న మహిళా రైతులకు పలువురు తమ మద్దతును ప్రకటించారు. పంజాబ్ నటి సోనియా మాన్ రైతుల పక్షాన నిలబడ్డారు.
ఢిల్లీ నగర సరిహద్దుల్లో 100 రోజులకు పైగా రైతులు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉండటంతో , ఈరోజు ఆందోళనలు ఉధృతంగా మారిన నేపథ్యంలో హర్యానా మరియు ఉత్తరప్రదేశ్తో ఢిల్లీకి లింక్ అయిన సరిహద్దు మార్గాలు సోమవారం పూర్తిగా మూసివేయబడ్డాయి. కొన్నిచోట్ల పాక్షికంగా వాహనాలకు అనుమతినిచ్చారు .

దాడి మళ్లించిన పోలీసులు ... ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు
యుపి నుండి ఢిల్లీకి వచ్చే వాహనదారులకు, ఘాజిపూర్ సరిహద్దు మూసివేయబడింది. ఆనంద్ విహార్, డిఎన్డి, లోని డిఎన్డి, అప్సర సరిహద్దుల మీదుగా వెళ్లే మార్గాలలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు. రిపబ్లిక్ డే హింస జరిగిన వెంటనే రైతులు క్లియర్ చేసిన చిల్లా సరిహద్దును కూడా ప్రయాణికులు ఎంచుకోవచ్చని పేర్కొన్నారు
. సింఘూ , తిక్రీ, ఆచండి, పియావు మన్యారి మరియు సబోలి మరియు మంగేష్ గుండా దేశ రాజధానికి వెళ్ళే మార్గాలు మరియు హర్యానా మధ్య రహదారులన్నీ నేడు మూసివేయబడ్డాయి. దీంతో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు .

రైతుల ఆందోళన నేపధ్యంలో పోలీసుల ముందస్తు జాగ్రత్తలు
ఢిల్లీ మరియు హర్యానా మధ్య ప్రయాణించే వాహనదారులకు లాంపూర్ సఫియాబాద్, పల్లా మరియు సింగు పాఠశాల టోల్ టాక్స్ సరిహద్దుల ద్వారా , గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్ గుండా వెళ్లే ఇతర మార్గాల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రైతుల ఆందోళన ఉధృతం గా మారిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హర్యానా , ఉత్తరప్రదేశ్ నుండి వచ్చే జాతీయ రహదారులను మూసివేశారు.
జాతీయ రహదారులపై ట్రాఫిక్ జామ్ .. పలు మెట్రో స్టేషన్లు మూసివేత
దీంతో 9వ నెంబరు జాతీయ రహదారి తోపాటుగా, ఎన్ హెచ్ 24 పై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది . ఢిల్లీ నుంచి ఘజియాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్ళించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ మెట్రో సంస్థ కూడా అప్రమత్తమైంది. ఆందోళనలు పూర్తయ్యేవరకు పలు మెట్రో స్టేషన్లను మూసివేసిన ట్లు అధికారులు ప్రకటించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు దేశమే కాదు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా మహిళా రైతుల ఉద్యమం కొనసాగింది. సాగు చట్టాలను తక్షణం రద్దు చెయ్యాలని మహిళా రైతులు డిమాండ్ చేశారు .












Click it and Unblock the Notifications