లోక్సభలో ఆజంఖాన్ వ్యాఖ్యల దుమారం.. సస్పెండ్ చేయాలని డిమాండ్..
ఢిల్లీ : లోక్సభ మహిళా ప్యానెల్ స్పీకర్పై సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అసభ్య కామెంట్లు చేసిన ఆయనపై మహిళా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు గానూ ఆజం ఖాన్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనలా మరెవరూ మహిళలను కించపరచలేదని, తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆజంఖాన్ క్షమాపణలు చెప్పకపోతే ఆయనను సస్పెండ్ చేయాలని మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు.

చట్టసభ సభ్యులపై మాయని మచ్చ
జీరో అవర్ పూర్తైన వెంటనే ఆజం ఖాన్ వ్యవహారంపై చర్చ ప్రారంభమైంది. ఈ అంశాన్ని తొలుత ప్రస్తావించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని కేవలం మహిళల వరకే పరిమితం చేయవద్దని, అది చట్టసభ సభ్యులందరిపైనా మాయనిమచ్చ అని అన్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి నాటకాలు ఆడినంత మాత్రాన ఎవరూ ఊరుకోరని స్మృతి హెచ్చరించారు. ఈ అంశంపై సభలోని వారంతా ఒకే మాటపై ఉండాలని కోరారు.

తీవ్రంగా ఖండించిన రక్షణమంత్రి
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. మహిళకు జరిగిన అవమానం విషయంలో సభ్యులందరూ ఏకతాటిపై నిలబడటాన్ని ఆమె అభినందించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నిర్మలా సీతారామన్ లేని పక్షంలో ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

సభలో ఉండే హక్కు లేదు
తనపట్ల అసభ్యకరమైన కామెంట్లు చేసిన ఎస్పీ నేత ఆజంఖాన్కు సభలో ఉండే హక్కు లేదని ప్యానెల్ స్పీకర్ రమాదేవి అభిప్రాయపడ్డారు. ఆయన మహిళల్ని ఎన్నడూ గౌరవించలేదన్న ఆమె గతంలో జయప్రదపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరుతానని రమాదేవి స్పష్టం చేశారు. తాను చేసిన తప్పుడు కామెంట్లకు ఆజంఖాన్ తప్పక క్షమాపణలు చెప్పాలని రమాదేవి డిమాండ్ చేశారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా తప్పుబట్టారు. మహిళను కించపరిచేలా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆజం ఖాన్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ప్యానెల్ స్పీకర్పై ఆజంఖాన్ అసభ్యకర వ్యాఖ్యలు
ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్ ప్యానెల్ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్లు చేశారు. సభాధ్యక్ష స్థఆనంలో ఉన్న ఆమెను చూస్తూ మీ కళ్లలోకి కళ్లు పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నానని అన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం కావడంతో స్పీకర్ ఓం బిర్లా ఆజం ఖాన్ను మందలించి క్షమాపణ చెప్పాలని సూచించారు. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం ఆయనను సమర్థిస్తూ పార్లమెంటులో బీజేపీ సభ్యుల భాషే అత్యంత అమర్యాదకరంగా ఉంటోందని ఆరోపించారు. క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదని, అన్ పార్లమెంటరీ పదాలు వాడితే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications