అధికారంలో ఉన్నవారికి తలవంచను: కోల్ స్కాం కేసులో ఈడీ విచారణపై అభిషేక్ బెనర్జీ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బొగ్గు కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతోంది. సోమవారం ఈడీ అధికారులు ఎంపీ అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో భాగంగా అభిషేక్ బెనర్జీ భార్య, అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న రెండు సంస్థల విదేశీ బ్యాంకు ఖాతాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. అభిషేక్ బెనర్జీ కుటుంబంతో సంబంధం ఉన్న రెండు సంస్థల ద్వారా వచ్చిన ఆదాయంలో లెక్క చూపని లావాదేవీల గురించి ఈడీ ప్రశ్నించింది. అయితే ఈడీ విచారణకు అభిషేక్ బెనర్జీ సహకరించడం లేదని విచారణకు సంబంధం ఉన్న అధికారి ఒకరు జాతీయ మీడియాతో అన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ.. తన తండ్రి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రెండు కంపెనీల ద్వారా బొగ్గు అక్రమ రవాణాకు పాల్పడి భారీగా ఆదాయం ఆర్జించినట్లు ఈడీ ప్రధాన అభియోగం.
అయితే ఈ అభియోగాలపై విచారణ నిలిపివేయాలంటూ అభిషేక్, అతని భార్య ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించగా.. తిరస్కరించింది. ఈడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన అభిషేక్ బెనర్జీ.. తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. తనపై కక్ష సాధింపుగానే ఈ కేసులు పెట్టారని ఆయన అన్నారు.
తనపై ఆరోపణలు చేస్తున్న వారు 10 పైసలు కూడా రుజువు చేయలేరని తాను అప్పుడే చెప్పానని.. ఆరోపణలు రుజువు చేయగలిగితే ఈడీ-సీబీఐ అవసరం లేకుండా నేరుగా ఉరిశిక్ష వేసినా స్వీకరిస్తానని అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈడీకి కోల్కతాలోనూ కార్యాలయం ఉందని అయితే ఢిల్లీలోనే విచారం చేపట్టడంపై బీజేపీ కుట్ర దాగివుందని అభిషేక్ ఆరోపించారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను స్వప్రయోజనాలకు వాడుకుంటోందని అభిషేక్ ఆరోపించారు.